లీల్వీవ్, మార్చి 12: ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో రష్యా బలగాలకు, ఉక్రెయిన్ సైన్యానికి మధ్య భీకర పోరాటం జరుగుతున్నది. కీవ్పై ముప్పేట దాడికి రష్యా ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం రష్యా బలగాలు కీవ్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రష్యా భారీ మిలిటరీ కాన్వాయ్ నగరాన్ని చుట్టుముడుతున్నది. కీవ్ సమీపంలోని ఎయిర్ఫీల్డ్పై రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. నగరంలోకి దూసుకువస్తున్న రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అనూహ్య షాక్ ఇచ్చింది. రష్యా యుద్ధ ట్యాంకులపై మెరుపు దాడులకు దిగింది. వాటిని ధ్వంసం చేసింది. రష్యా యుద్ధ ట్యాంకులు ఒక్కొక్కటిగా పేలిపోతున్న దృశ్యాలు సినిమాను తలపించాయి. కీవ్తో పాటు ఉక్రెయిన్లోని అన్ని ప్రధాన నగరాలపై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. మరియుపోల్లో శనివారం ఓ మసీదుపై రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. ఆ సమయంలో మసీదులో 86 మంది ఉన్నారు. అందులో 34 మంది పిల్లలు. రష్యా దాడులకు భయపడే వారంతా అందులో తలదాచుకొన్నారు. దాడిలో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా తెలియలేదు. మరియుపోల్ తూర్పు ప్రాంతాన్ని రష్యా స్వాధీనంలోకి తీసుకొన్నది. అమెరికా, ఐరోపా దేశాల చర్యలతో అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఐఎస్ఎస్) కూలిపోయే ప్రమాదం ఉందని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ డైకెర్టర్ రోగోజిన్ మరోసారి హెచ్చరించారు.
దక్షిణ ఉక్రెయిన్లోని మెలిటోపోల్ నగర మేయర్ను రష్యా కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఈ చర్యలు ఐసిస్ ఉగ్రవాదం కంటే ఏమాత్రం తక్కువ కాదు అని మండిపడ్డారు. రష్యా నుంచి ఒక్కో కంపెనీ వెళ్లిపోతున్న వేళ ఆ దేశం కాపీ రైట్ చట్టాలను సులభతరం చేస్తున్నది. స్థానిక కంపెనీలు విదేశీ కంపెనీల మేధో సంపత్తిని దొంగతనం చేసేలా ప్రోత్సహిస్తున్నది. తద్వారా ఆంక్షల ప్రభావాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నది.
నాటో దేశాల్లోని ప్రతీ అంగుళాన్ని కాపాడటానికి అమెరికా కట్టుబడి ఉందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇందుకోసం మూడో ప్రపంచయుద్ధమైనా సరే చేస్తామన్నారు. ‘నాటోను కాపాడుకోవడం మా పవిత్ర కర్తవ్యం’ అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నేరుగా జోక్యం చేసుకోబోమని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ అనుకొని నాటో దేశాలకు బలగాలను పంపించారు.