తాను నటించిన సినిమా థియేటర్లో విడుదలైనా, ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా ఫర్వాలేదని చెబుతున్నది బాలీవుడ్ నాయిక జుహీ చావ్లా. ఈ నిన్నటితరం అగ్ర నాయిక నటించిన తాజా సినిమా ‘శర్మాజీ నమ్కీన్’ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది. హిందీ దిగ్గజ నటుడు రిషి కపూర్ నటించిన చివరి సినిమా ఇదే కావడం బాధాకరం. ఈ చిత్రాన్ని హితేష్ భాటియా తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన అనుభవాల గురించి జుహీ చావ్లా మాట్లాడుతూ…‘రిషిజీతో కలిసి నటించడం మర్చిపోలేని అనుభూతి. ఆయన మనల్ని ఆకస్మాత్తుగా వదిలి వెళ్లిపోయారు. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కావడం మంచిదే. ప్రపంచవ్యాప్తంగా వయసు తేడా లేకుండా ప్రేక్షకులంతా సినిమాను చూడగలుగుతారు. మరొకరి అంచనాలను అందుకునేందుకు సినిమాలు ఎంచుకోను. నాకు నచ్చిన మంచి కథలు ఎంపిక చేసుకోవడానికి, ఆ పాత్రల్లో బాగా నటించడానికే ప్రాధాన్యతనిస్తాను. ఇక ఆ సినిమా ఏ వేదిక మీద విడుదలైనా ఫర్వాలేదు. థియేటర్లలోనే నా సినిమా రిలీజ్ కావాలనే పట్టింపులు లేవు’ అని చెప్పింది.