హైదరాబాద్ : సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సినీ నటి సమంత బుధవారం కూకట్పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాది గురువారం జడ్జికి విజ్ఞప్తి చేశారు. సెలబ్రిటీలను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు ముందు అందరూ సమానమేనన్నారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా న్యాయస్థానం ముందు ఒక్కటేనని స్పష్టం చేశారు. కోర్టు సమయం చివరలో పిటిషన్పై విచారిస్తామని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ డాక్టర్ సీఎల్ వెంకట్రావ్తో పాటు సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా దాఖలు చేశారు. నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి ఆ రెండు ఛానళ్లలో వెంకట్రావ్ అసత్య ప్రచారాలు చేస్తూ కించపరిచారని పిటిషన్లో ఆరోపించారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య వ్యాఖ్యలు చేశారని, మీడియా ద్వారా భేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సమంత.