న్యూఢిల్లీ, నవంబర్ 23: ఐటీ సర్వీసుల పరిశ్రమ నియామకాల జోరును మరింత పెంచనున్నది. వాణిజ్య సంస్థల నుంచి డిజిటలైజేషన్కు వస్తున్న డిమాండ్ దృష్ట్యా సిబ్బంది సంఖ్యను వేగంగా పెంచుకునేదిశగా ఐటీ కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ ఆరునెలల కాలంలో స్థూలంగా 4.5 లక్షల మందిని ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రణాళికను దేశీ ఐటీ రంగ సంస్థలు అమలు జరుపుతున్నట్లు మార్కెట్ ఇంటిలిజెన్స్ సంస్థ అన్ఎర్త్ఇన్సైట్ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. వివరాలు ఇవి…
సాఫ్ట్వేర్ సర్వీసుల కంపెనీల నుంచి వలసలు అధికంకావడం కూడా తాజా నియామకాల జోరుకు కారణమయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ నిపుణుల వలసలు 17-19 శాతం ఉంటాయని అంచనా
ఈ ఆరు నెలల్లో వలస వెళ్లినవారి స్థానాల్ని భర్తీ చేయడంతోపాటు నికరంగా మరో 1.5-1.7 లక్షల నియామకాలు జరుగుతాయి. వీరిలో అనుభవం కలిగిన నిపుణులతో పాటు ఫ్రెషర్స్ కూడా ఉంటారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో జరిగిన నియామకాలకంటే ద్వితీయార్ధంలో రిక్రూట్మెంట్స్ 12 శాతం అధికం.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 2,50,000 మంది ఫ్రెషర్స్ను ఐటీ సంస్థలు నియమించుకున్నాయి. అత్యధికంగా టీసీఎస్ 77,000 మంది ఫ్రెషర్స్ను చేర్చుకోగా, ఇన్ఫోసిస్ 45,000, కాగ్నిజెంట్ 45,000, హెచ్సీఎల్ టెక్ 22,000 మందిని నియమించాయి.
టెక్నాలజీ సంస్థలు వాటి సిబ్బంది నైపుణ్యాన్ని పెంచేందుకు అప్స్కిల్లింగ్ ప్రోగామ్లపై ప్రధానంగా దృష్టి నిలిపాయి. టాప్ 2 ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్లు వారి ఉద్యోగులకు ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ను ఆఫర్ చేస్తున్నాయి. విప్రో, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా, మైండ్ ట్రీ, ఎంఫసిస్లు వారి ఉద్యోగుల లెర్నింగ్, అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కోసం సింగిల్ ఇంటర్ఫేస్ ఏర్పాటుచేస్తున్నాయి.
ఐటీ సంస్థలకు క్లౌడ్ కంప్యూటింగ్ కీలక ఆదాయ వనరుగా ఆవిర్భవిస్తున్నదని అన్ఎర్త్ఇన్సైట్ నివేదిక పేర్కొంది. 2030 సంవత్సరానికల్లా క్లౌడ్ ద్వారా ఐటీ సర్వీసుల పరిశ్రమకు 80 నుంచి 100 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్, ప్లాట్ఫామ్ వ్యాపారం ద్వారా టాప్ ఐటీ కంపెనీల ఆదాయం 2030కల్లా 15 నుంచి 20 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని నివేదికలో తెలిపారు.