Akash Ambani : భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ (Mukesh Ambani) పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ (Akash Ambani) ని జియో ప్లాట్ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ (Jio platforms MD) గా నియమించారు. రిలయన్స్ (Reliance) కు చెందిన ఈ డిజిటల్ సేవల సంస్థ ఐపీవోకు వెళ్ళనుంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ అంబానీని మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఏప్రిల్ 9 నుంచి ఈ నియామకం అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఐదేళ్ల కాలంపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని మే 7న సమర్పించిన ఫైలింగ్ లో పేర్కొన్నది.
జియో ప్లాట్ఫామ్స్ ఐపీవోకు సన్నద్ధమవుతున్న వేళ ఈ నియామకం చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది మే నెలాఖరున లేదా జూన్ నెలలో ఐపీవోకు సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించే అవకాశం ఉంది. టెలికం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డులో 2014 అక్టోబర్ నుంచి ఆకాశ్ అంబానీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2022 జూన్ నెలలో ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.
ఆకాశ్ అంబానీ నేతృత్వంలో జియో 2016 లోనే కేవలం ఆరు నెలల వ్యవధిలో 10 కోట్ల మంది సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. 2026 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.30 వేల కోట్ల నికర లాభాన్ని రూ.1.46 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది.