వడోదర : తాను పనిచేస్తున్న జ్యూవెలరీ స్టోర్ నుంచే 7 కిలోలకు పైగా బంగారాన్ని మాయం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గుజరాత్లోని వడోదరలో వెలుగుచూసింది. చీటింగ్, చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్రధాన నిందితుడు విరాల్ సోని జ్యూవెలరీ స్టోర్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. విరాల్ సోనికి చోరీ చేసిన బంగారం అమ్మడంలో అదే స్టోర్లో పనిచేస్తున్న తరజ్ దివాన్ సహకరించాడు.
సోని 2016 నుంచి 2021 మధ్య 7.8 కిలోల విలువైన 24 కేరట్ల బంగారు నాణేలను చోరీ చేశాడని ఆగస్ట్ 9న వడోదర సంస్ధ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షోరూం క్యాషియర్లకు నకిలీ వోచర్లను సమర్పించి గోల్డ్ కాయిన్స్ను సోని చోరీ చేశాడని స్టోర్ యజమాని పరేష్ సోని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎప్పటికప్పుడు ముగ్గురు కస్టమర్ల పేర్లతో నకిలీ వోచర్లను ఇస్తుండటంతో అనుమానించిన క్యాషియర్ యజమానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. కాగా అప్పులు తీర్చేందుకు, తన కుమారుడి విదేశీ విద్య కోసం ఈ నేరానికి పాల్పడినట్టు నిందితుడు దర్యాప్తులో వెల్లడించాడని పోలీసులు తెలిపారు.