‘గిరిజన ప్రజలకు న్యాయం చేయడానికి పోరాడే లాయర్గా నేను ఈ సినిమాలో కనిపిస్తా.1993లో తమిళనాడులో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం’ అని అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జై భీమ్’. టీజే జ్ఞానవేల్ దర్శకుడు. అమెజాన్ ప్రైమ్ ద్వారా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సందర్భంగా సూర్య పాత్రికేయులతో మాట్లాడుతూ ‘తమిళనాడులో 96 వేలకు పైగా కేసులను పరిష్కరించి సామాన్యులకు న్యాయం చేసిన సీనియర్ లాయర్ చంద్రు స్ఫూర్తితో నా క్యారెక్టర్ సాగుతుంది. అన్యాయంగా జైలు పాలైన తన భర్తను కాపాడుకోవడానికి ఓ గిరిజన మహిళ సాగించిన పోరాటానికి ఓ లాయర్ ఎలా అండగా నిలిచాడు? ప్రభుత్వం, పోలీసు వ్యవస్థలోని అవినీతిని ఎలా ఎదుర్కొన్నాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది.
లాయర్ చంద్రు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. చంద్రు జీవితంపై చాలా పరిశోధన చేశా. కోర్టులో ఆయన కేసులను వాదించే తీరు, ఆయన ఫొటోలు, పుస్తకాలు అన్నింటిని చదివి పాత్రను చేశా. ప్రజలకు చెప్పాల్సిన మంచి కథ అనే ఆలోచనతోనే ఈ చిత్రాన్ని నిర్మించా. నా హృదయానికి బాగా దగ్గరైన చిత్రమిది. ఈ సినిమాను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చూడటం ఆనందంగా ఉంది. ఆయన ఈ సినిమాను ప్రశంసించడం గర్వంగా అనిపిస్తున్నది. చరిత్రలో మరుగున పడిన గొప్ప పోరాట యోధుల గురించి తెలియాల్సిన అవసరం ఉంది. నిజ జీవిత కథలు సమాజంలో మార్పు తీసుకురావడానికి దోహదపడతాయి. పోలీస్ వ్యవస్థలోని మరో కోణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. ప్రతి ఒక్కరిలో ఆలోచనను రేకెత్తించే చిత్రమవుతుంది’ అని తెలిపారు. తమిళంలో నటించాలనే తన కల ఈ సినిమాతో తీరిందని, ఇందులో ప్రభుత్వం తరఫున వాదించే లాయర్గా తాను కనిపిస్తానని రావురమేష్ అన్నారు. రెండేళ్లు పరిశోధన చేసి ఈ సినిమాను తెరకెక్కించానని దర్శకుడు పేర్కొన్నారు.