90వ దశకంలో కాశ్మీర్ పండిట్లపై జరిగిన ఊచకోతకు ప్రతిరూపంగా ‘ద కాశ్మీర్ ఫైల్స్’ అనే చిత్రాన్ని రూపొందించానని చెబుతున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా వివరాలను చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..‘90వ దశకంలో కాశ్మీర్ పండిట్లపై తీవ్రమైన హింస జరిగింది. ఆ హింస గురించి మనకే పూర్తిగా తెలియకపోవడం విచారకరం. అక్కడి విషయాలన్నీ పరోక్షంగా తెలిసినవే గానీ అక్కడికి వెళ్లి ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ బాధితుల ఆవేదనకు ప్రతిరూపమే మా సినిమా’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు దర్శన్ కుమార్, నటి పల్లవి జోషి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.