మాదాపూర్, నవంబర్ 8: కొవిడ్ కష్ట సమయంలో స్వచ్ఛంద సేవలందించిన బాలీవుడ్ నటుడు, సామాజిక కార్యకర్త సోనూసూద్పై ఐటీ సోదాలు జరిపించి, ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తన వంతు బాధ్యతగా సేవలందించిన సోనూసూద్కు రాజకీయాలు ఆపాదిస్తూ కొందరు రకరకాల వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఆయన వాటిని పట్టించుకోకుండా గొప్ప పనులు చేస్తూ, అందరి మనసులో రియల్ హీరోగా గుర్తింపు పొందారని ప్రశంసించారు.
సోమవారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ (టీఎస్ఐజీ) నిర్వహించిన కార్యక్రమంలో కొవిడ్ సమయంలో ఉత్తమ సేవలందించిన, ఐటీ, స్వచ్ఛంద సంస్థలు, నిర్మాణ సంస్థలు, ఇతర కంపెనీలకు మంత్రి కేటీఆర్, బాలీవుడ్ నటుడు సోనూసూద్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మంచి పనులు చేసే వారిపై నిందలు మోపడం, అవహేళన చేయడం సహజమేనని, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగేవారికి సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని చెప్పారు. కొవిడ్ కష్టకాలంలో సేవలందించిన ప్రతి ఒక్కరూ హీరోలేనని ప్రశంసించారు. సోనూసూద్ మాట్లాడుతూ.. కొవిడ్ కష్టకాలంలో శానిటైజర్లు, మాస్కులు, భోజనాలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు వైరస్ బాధితులకు ప్రత్యేక వార్డులు, గదుల్లో పడకల ఏర్పాటు తదితర సేవలందించినవారు నిజమైన హీరోలని, వారి సేవలను ఎన్నటికీ మరువలేమని చెప్పారు.
కొవిడ్ కష్టాల్లో చిక్కుకొన్నవారిని ఆదుకొనేందుకు మానవతావాద దృక్పథంతో ఎందరో ముందుకొచ్చారని అభినందించారు. ఐటీ, పరిశ్రమలశాఖల కార్యదర్శి జయేశ్రంజన్ మాట్లాడుతూ.. కొవిడ్ సంక్షోభంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతోమందికి సేవలు అందించినవారిని గుర్తించి, అవార్డులు అందజేయడం సంతోషకరమని చెప్పారు. కార్యక్రమంలో 12 కార్పొరేట్ సంస్థలు, 26 ఎన్జీవోలు, 6 సమన్వయ సంస్థలు, 29 మంది స్వచ్ఛంద సేవకులతోపాటు 850కి పైగా సంస్థలను ఈ-సర్టిఫికెట్ (ఎలక్ట్రానిక్) ద్వారా సత్కరించారు.