న్యూఢిల్లీ : భారత్లోని పలు రాష్ట్రాలతో పాటు నగరాల్లో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం హెచ్చరించింది. వైరస్ను నిర్మూలించేందుకు అవసరమైన నియమాలు పాటించడంపై దృష్టి పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సూచించారు. కరోనా ముప్పు ఎక్కువగానే ఉందని, దాని నుంచి ఇంకా ఏ దేశం బయటపడలేదని చెప్పారు. వైరస్ ఉందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, వైరస్ నియంత్రణపైనే అందరి దృష్టి ఉండాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కొవిడ్ ముగింపు దశలో ప్రవేశిస్తోందా? అన్న ప్రశ్నకు.. ప్రస్తుతం మనం ఇంకా మహమ్మారి మధ్యలోనే ఉన్నామన్న ఆమె.. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని, ప్రాణాలను కాపాడడంపై దృష్టి పెట్టాలన్నారు. ముగింపు దశకు చేరుకున్నంత మాత్రాన.. వైరస్ ఆందోళనకరం కాదని అనుకోవడానికి లేదని స్పష్టం చేశారు. డెల్టా వేరియంట్తో పోలిస్తే.. ఒమిక్రాన్ మన శ్వాసకోశ కణజాలానికి సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ తెలిపారు. డెల్టా వేరియంట్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి.. ప్రభావం చూపుతుందని.. అందుకే ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ కారణంగా మరణాల రేటు, తీవ్రమైన అనారోగ్యం కలిగే ప్రమాదం తక్కువగా ఉందని చెప్పారు.
అయితే, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతున్న దేశాల్లో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరిగిందని, ఆరోగ్య వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. దేశంలో ఇంకా వ్యాక్సినేషన్ను పెంచాల్సిన అవసరం ఉందని, టీకాలు వైరస్ నుంచి రక్షణ కల్పిస్తున్నాయన్నారు. ముఖ్యంగా బూస్టర్ డోస్ ఒమిక్రాన్ నుంచి రక్షణ ఇస్తుందన్న ఆమె.. ప్రజలు తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం, మరణాలు సంభవించే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఖేత్రపాల్ వివరించారు.