మన ప్రధాని నరేంద్ర మోదీజీ గత శనివారం ప్రైవేటు పెట్టుబడిదారులను ఉద్దేశించి ఒక వెబ్నార్లో మన
విద్యార్థులు ఉన్నత విద్య కోసం, ప్రధానంగా వైద్య విద్య కోసం చిన్నచిన్న దేశాలకు వెళ్తున్నారన్నారు. దీనివల్ల దేశ సంపద తరలిపోతున్నదని విచారం కూడా వ్యక్తం చేశారు.
రెండు రోజుల తర్వాత కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ… విదేశాలకు వెళ్లే వైద్య విద్యార్థుల్లో 90 శాతం మంది అర్హత పరీక్ష పాస్ కావట్లేదన్నారు. ఉక్రెయిన్లో 12 వేల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్న నేపథ్యంలో వీరు ఈ వ్యాఖ్యలు చేయడం అనాలోచితం అనుకోలేం. ఇది మొదలు వైద్య విద్యార్థులంతా దేశానికి ఏదో నష్టం చేస్తున్నట్లు, ఇక్కడ చదవడం చేతగాక విదేశాలు వెళ్లినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభమైంది. అసలు సమస్యను పక్కదారి పట్టించే ఈ ప్రయత్నం బాధ్యత గల మంత్రుల నుంచే మొదలవడం గర్హనీయం.
విమాన చార్జీలను కేంద్ర ప్రభుత్వం అదుపులో పెట్టి ఉంటే విద్యార్థులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో స్వదేశం చేరుకునేవారు. మరోవైపు ఇప్పుడు చిక్కుకుపోయిన 12 వేల మంది సరిహద్దుల దాకా రవాణా సౌకర్యం కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. తినేందుకు ఆహారం, తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రత ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యం. బాధితులకు బాసటగా నిలవలేని కేంద్రం, విద్యార్థులదే తప్పని చెప్తూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుండటం వాంఛనీయం కాదు. వైద్య విద్య కోసం విద్యార్థులు విదేశాలకు ఎందుకు వెళ్తున్నారనే కనీస అవగాహన కేంద్రంలోని పెద్దలకు లేకపోవడం దురదృష్టకరం.
ఉక్రెయిన్లోని భారత విద్యార్థుల సంఖ్య సుమారు 18 వేలు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో వీరి వాటా 24 శాతం. వైద్య విద్య కోసం ఇక్కడికి వెళ్లే విద్యార్థులు రూ 20 నుంచి 30 లక్షల ఖర్చుతో తమ చదువు పూర్తిచేస్తున్నారు. ఇదే చదువుకు మన దగ్గర రూ.80 లక్షల నుంచి కోటి వరకు ఖర్చవుతుంది. అసలే సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేని మన దేశంలో వైద్యవిద్య వ్యాపారవనరుగా మారిపోయింది. ఈ పాపం ఎవ్వరిది? ఇక్కడ మెడికల్ కాలేజీల సంఖ్య పెంచకుండా, కొత్తగా ఇచ్చే అరకొర కళాశాలలను కూడా అన్ని రాష్ర్టాలకు పారదర్శకంగా ఇవ్వని ఫలితం కాదా? ఈ మధ్యనే దేశవ్యాప్తంగా ‘సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం’ కింద ఇచ్చిన మెడికల్ కాలేజీలలో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం ఒక ఉదాహరణ మాత్రమే.
ఇప్పుడు వేల మంది మన విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకుపోగా వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ అవకాశం లేక విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటే సంపద తరలిపోతుందని మోదీ వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? ఈ విద్యార్థులు ఏ దేశంలో చదివినా మళ్ళీ వచ్చి ఈ దేశ ప్రజలకే కదా సేవలు చేసేది. నైపుణ్యాన్ని మించిన సంపద ఏముంటుంది? విదేశీ కాలేజీలు కూడా డబ్ల్యూహెచ్వో, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించినవే. ఆ విద్యార్థులు కూడా వచ్చిరావడంతోనే కత్తులు పట్టుకొని ఆపరేషన్లు చేయరు. నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు జాతీయస్థాయిలో నిర్వహించే క్లిష్టమైన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ)లో ఉత్తీర్ణులు కావాల్సిందే. మరోవైపు ఇక్కడ కూడా 14 లక్షల మంది రాసే నీట్ పరీక్షలో దాదాపు 8 లక్షల మంది, అంటే సగానికన్నా ఎక్కువ ఉత్తీర్ణులవుతున్నారు. ప్రజా అవసరాల మేరకు మనం మెడికల్ సీట్లు పెంచుకోలేక ఆ నెపం విద్యార్థుల మీదికి, వారి తల్లిదండ్రుల మీదికి నెట్టడం క్షమించరానిది. విదేశాల్లో చదువుకొని వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారంటేనే దేశానికి అర్హులైన వైద్యుల అవసరం ఉందనే కదా.
కరోనా కల్లోలాన్ని యావత్ దేశం చవిచూస్తూనే ఉన్నది. గంగానదిలో శవాలు ప్రవహించిన చేదు అనుభవాల తర్వాత కూడా వైద్య సేవలను పెంచుకోలేకపోతే ముందుతరాలు మనలను క్షమించవు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కరోనా రెండో దశ విజృంభణకు అసలు కారణం. ఇక్కడ మరణాలు అధికంగా నమోదవుతున్న 2021, ఏప్రిల్లో సైతం 14 దేశాలకు వ్యాక్సిన్లు పంపడం ఏం రాజనీ తి. కరోనా వ్యాక్సిన్ల మీద జీఎస్టీ వేయడం, వాటర్ బాటిల్ ధరకు అందిస్తామన్న వ్యాక్సిన్ను రూ.1600కు అమ్మడం, అమెరికా హెచ్చరికలతో హైడ్రాక్సీ క్లోరైడ్ వంటి మందులను అక్కడికి పంపడం వంటి చర్యలు కాదా కారణం. ఆఖరికి కరోనా మొదటి దశ కాలంలో వచ్చిన ‘పీఎమ్ కేర్స్’ విరాళాలతో దేశవ్యాప్తంగా 162 ఆక్సిజన్ ప్లాంట్లు కడతామన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెంట్రల్ మెడికల్ సప్లయ్ స్టోర్స్’ వైఫల్యంతో ఆక్సిజన్ అందక అనేక ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదకర నిర్లక్ష్యాన్ని ఇకనైనా వీడుదాం.
డబ్ల్యూహెచ్వో చెప్పినట్లు ప్రతి వెయ్యి మందికి ఒక ఎంబీబీఎస్ లేదా అందు కు సమాన అర్హత కలిగిన వైద్యుడు దేశంలో అందుబాటులో ఉన్నారా? ఏడేండ్ల పాలన తర్వాత కూడా వైద్యరంగంలో పెట్టుబడులు పెట్టండని ఎవరినో దేబిరించే బదులు కేంద్రమే ముఖ్య భూమిక పోషించాలి. ప్రభుత్వమే స్వయంగా మెడికల్ కాలేజీలను పెడుతూ మరోవైపు ప్రైవేటు కాలేజీల సంఖ్యను పెంచాలి. డొనేషన్ల దందాకు తెరదించి వైద్యవిద్యను భూమార్గం పట్టించాలి.
ఫిలిప్పైన్స్, నేపాల్, ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాలు చేస్తున్న ఈ పని మనం చేయలేమా? సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించలేమా? ఇక్కడే అవసరమైన వైద్య విద్య చదివే అవకాశం ఉంటే మన విద్యార్థులు విదేశాలకు ఎందుకు వెళ్తారు? పైగా, అందరికీ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ఇది గొప్ప ముందడుగు కాగలదు.
ఉక్రెయిన్లో ఉంటున్న మొత్తం భారతీయులు దాదాపు 20 వేల మంది. కాగా ఇప్పటివరకు 9 వేల మంది భారత్ చేరుకున్నారు. ఇందులో నిన్నటివరకు 2400 మందిని మాత్రమే భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ ద్వారా ఇండియా తీసుకువచ్చింది. మిగతా వారు సొంత ఖర్చులతో వచ్చినవారే. వీరు సాధారణంగా రూ.20 నుంచి 30 వేలు ఉండే విమాన చార్జీలను రూ.లక్ష వరకు చెల్లించారు. ముందే హెచ్చరించామంటున్న కేంద్రం విమాన ప్రయాణ చార్జ్జీలను అదుపులో పెట్టకపోవడం వైఫల్యం కాదా?
రంగు నవీన్ ఆచారి