గీతా సైనీ.. తొలి సినిమాతోనే అరడజను అవకాశాలకు సరిపడా పేరు తెచ్చుకుంది. ఏదో ఒక రోజు నృత్యమే ఇతివృత్తంగా సినిమా చేస్తాననీ అంటున్నది. ఈ హైదరాబాదీ అమ్మాయికి టాలీవుడ్ తెగ నచ్చేసింది. తెలుగు ప్రేక్షకులతో ప్రేమలో పడిపోయాననీ అంటున్నది. ప్రస్తుతం, సక్సెస్ తాలూకు ‘పుష్పక విమానం’లో ప్రయాణిస్తున్న గీతా సైనీ సరదా కబుర్లు..
తెలుగు పరిశ్రమకు, తెలుగు ప్రేక్షకులకు ప్రాంతీయ భేదం లేదు. అందర్నీ ప్రోత్సహిస్తారు. మంచి సినిమాలను ఆదరిస్తారు. మొదటి చిత్రంలోనే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభిస్తుందని ఊహించలేదు. ‘తొలి సినిమాలోనే అదరగొట్టావు’ అంటూ చాలామంది మెచ్చుకున్నారు.
చదువుకునే రోజుల్లో ఏ కార్యక్రమం జరిగినా ముందుండేదాన్ని. అలా నాకు తెలియకుండానే నటనపై ఆసక్తి పెరిగింది. అయితే, కెరీర్గా ఎంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. మా వాళ్లెవరూ పరిశ్రమలో లేరు. అసలు, ఇంట్లో ఒప్పుకొంటారనీ అనుకోలేదు. కానీ, అందరి పోత్సాహంతో మీ ముందున్నా.
చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్కు సంబంధించిన సినిమాలే చూసేదాన్ని. నటిగానే కాదు, డ్యాన్సర్గానూ సాయిపల్లవిని అభిమానిస్తా. నృత్యం ప్రధాన ఇతివృత్తంగా ఓ సినిమా చేయాలని ఉంది. ఈమధ్య తెలుగులో వస్తున్న కామెడీ సినిమాల్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నా. పిచ్చిపిచ్చిగా నవ్వుకుంటున్నా.
‘పుష్పక విమానం’లో అవకాశం రావడానికి నా స్నేహితులే కారణం. నాకు తెలియకుండానే ఫొటోలు పంపారు. ఓరోజు, ఆడిషన్స్కి రమ్మంటూ ఫోన్. ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు భయం. బిక్కుబిక్కుమంటూ వెళ్లాను. మీనాక్షి పాత్రకు నూటికి నూరుశాతం సరిపోతానని నన్ను ఎంచుకున్నారు. కానీ ఆ పాత్రలో లీనం కావడానికి చాలా కష్టపడ్డాను. ఆ మూడ్ పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నా. సెట్లో ఎవరైనా జోక్ వేసినా నవ్వేదాన్ని కాదు.
మొదటి సినిమా ఫలితం చూశాకే, రెండో సినిమాకు సంతకం చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే ‘పుష్పక విమానం’ నిర్మాణ దశలో ఉండగా వచ్చిన ఆఫర్లన్నీ వదులుకున్నా. ఇప్పుడు నామీద నాకు నమ్మకం వచ్చింది. కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసి మంచినటిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా తక్షణ కర్తవ్యం