Hyderabad | హైదరాబాద్లోని జియాగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థిని నవ్య బుధవారం రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం దాకా తమతో సంతోషంగా గడిపిన కూతురు.. ఉన్నట్టుండి రూమ్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవడంపై ఆమె తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజల కారణంగానే నవ్య ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు.
తమ కూతురు నవ్య ఆటల్లో, చదువులో చురుగ్గా ఉండేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే గత గురువారం ( జూన్ 1న) అవామాస్య రోజున కొందరు నిమ్మకాయలు, నల్లబొమ్మలను తమ ఇంటి ముందు పడేసి వెళ్లారని నవ్య తల్లిదండ్రులు తెలిపారు. అప్పట్నుంచి నవ్య మానసికంగా భయాందోళనలకు గురయ్యిందని చెప్పారు. కళ్లు మూసినా, తెరిచినా అవే కనబడుతున్నాయని చెప్పేదన్నారు. అప్పట్నుంచి చీకటైతే చాలు భయపడేదని.. ఎక్కడికి వెళ్లాలన్నా తోడు రమ్మనేదని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం (జూన్ 7న) కూడా ఇంటి ముందు నిమ్మకాయలు, కుంకుమ కనిపించడంతో మళ్లీ భయపోయిందని పేర్కొన్నారు. వాటిని నవ్యనే ఇంటి ముందు నుంచి ఊడ్చేసి, కాల్చేసిందని తెలిపారు. ఆ తర్వాత స్నానం చేసి వచ్చి తమతో కాసేపు గడిపిందని.. కొద్దిసేపటికే గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందంటూ వాపోయారు. ఇంటి ముందు నిమ్మకాయలు, నల్ల బొమ్మలు కనబడకపోతే తమ కూతురు ఇంతటి అఘాయిత్యాన్ని ఒడిగట్టేది కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు చెబుతున్నట్లుగా నిజంగానే క్షుద్ర పూజల భయంతోనే ఆత్మహత్య చేసుకుందా? మరే కారణాలైనా ఉన్నాయా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.