హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ఒకవేళ 2022 మార్చి/ఏప్రిల్ నెలల్లో సెకండియర్ పరీక్షలను నిర్వహించలేని పరిస్థితులు ఎదురైతే, ఈ పరీక్షల మార్కుల ఆధారంగా విద్యార్థులను పాస్చేసే అవకాశాలుంటాయని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. ఈ బ్యాచ్ విద్యార్థులు ఎస్సెస్సీలో పరీక్షల్లేకుండానే పాస్అయ్యారని, మళ్లీ ఇప్పుడు పరీక్షల్లేకుండానే పాస్ చేస్తే విద్యార్థులే నష్టపోయే ప్రమాదముందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి మొదలుకానున్న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లుచేసినట్టు తెలిపారు. శనివారం నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్తో బాధపడుతున్న వారిని పరీక్షలకు అనుమతించబోమని తెలిపారు. ఇలాంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలున్న వారిని ఐసొలేషన్ గదుల్లో పరీక్షలు రాసుకునేందుకు అనుమతిస్తామని తెలిపారు. మొత్తం 4,59,228 విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా 1,768 కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూం నంబర్ల (040 – 24601010, 040- 24655027)ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో పరీక్షల విభాగం కంట్రోల్ అబ్దుల్ ఖాలిక్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ఓఎస్డీ సుశీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.