గిరిమిల్లపాడులో 44.1 డిగ్రీలు
కొత్తగూడెం జిల్లాలో కూడా
20 ప్రాంతాల్లో 42.3 డిగ్రీలపైనే నమోదు
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. వాతావరణ పరిభాషలో రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గురువారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గిరిమిల్లపాడులో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా బూర్గంపహాడ్, ముల్కలపల్లిలో 44 డిగ్రీలుగా రికార్డయింది. ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి, నల్లగొండ జిల్లాల్లోని 20 ప్రాంతాల్లో 42.3 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి.
ఒకటి రెండ్రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి, వడగాడ్పులు వీచే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తున్నది. రాష్ట్రంలో గాలిలో తేమ 10 నుంచి 55 శాతం మధ్య నమోదైంది. నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గాలిలో తేమ 10 శాతానికి తగ్గింది. మధ్యాహ్నం సమయంలో కాసేపు ఎండలో ఉంటే గొంతు తడారి పోతున్నది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలకు చేరుకోవడం గమనార్హం. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరులో 18.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. రాత్రిపూట ఉక్కపోత పెరిగింది.
అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి
రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో ఉత్తర దిశనుంచి వీస్తున్న గాలుల వల్ల రాగల మూడ్రోజులు పొడి వాతావరణం ఉంటుంది. శని, ఆదివారాల్లో ఒకటి రెండుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉన్నది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ రూరల్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీచేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకూడదని సూచించింది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉష్ణతాపానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే ఇండ్లనుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మధ్యాహ్నం రహదారులన్నీ నిర్మానుషంగా మారిపోతున్నాయి.
గ్రేటర్లో ఉక్కపోత
గ్రేటర్ హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. గతే డాది ఏప్రిల్-మే మాసంలో గరిష్ఠ ఉష్ణోగ్రత లు అత్యధికంగా 42-43 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఈ సారి మార్చి చివరలోనే 40 డిగ్రీలు దాటాయి. గాలిలో తేమశాతం తగ్గ డం, పగటి పూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. గురువా రం నగరంలో 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత వల్ల క్యుములోనింబస్ ప్రభావంతో నగరంలో అప్పుడప్పుడు వ ర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపారు.