జ్వరం వస్తే విద్యార్థి యూనిఫామ్కి తగిలించుకున్న బ్యాడ్జ్ వెలుగుతుంది. శరీరంలో సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చప్పుడు చేయని అది.. 99 డిగ్రీల జ్వరం వస్తే మాత్రం వెంటనే అలర్ట్ చేస్తుంది. దీంతో టీచర్లు సకాలంలో స్పందించి విద్యార్థులకు సరైన సమయంలో సరైన వైద్యం అందించడానికి వీలవుతుంది. ‘ప్రొటెక్ట్ అవర్ లైఫ్ లైన్’ పేరుతో ఈ సరికొత్త పరికరాన్ని హిమాయత్నగర్ జోన్కు చెందిన సెయింట్ పాల్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అమర్త్య వరహాల కనిపెట్టారు. అంతేకాకుండా స్మార్ట్ గ్యాస్ సెన్సార్ మిషన్, క్లీనింగ్ ఆఫ్ వాటర్ బాడీస్, రివర్స్.. స్మార్ట్ రోబోటిక్ వెయిటర్, హ్యూమన్ ఎనర్జీ గ్రిడ్ వంటి పదహారు రకాల పరికరాలను జిల్లాకు చెందిన 16 మంది బాల శాస్త్రవేత్తలు రూపొందించారు.
వాటికి సంబంధించి ప్రాజెక్టులు తయారు చేసి భళా అనిపించుకున్నారు. జిల్లా నుంచి ‘ఇన్స్పైర్ అవార్డు మానక్-2020-21’ సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికైనట్లు జిల్లా విద్యాధికారి రోహిణి సోమవారం ప్రకటించారు.
సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి ప్రయోగాలు చేసే విధంగా పాఠశాల స్థాయి నుంచి ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి ఏడాది ఇన్స్పైర్ అవార్డు మానక్ పేరిట బాల శాస్త్రవేత్తలకు అవార్డులు అందిస్తున్నది. ఈ మేరకు 2020-21 విద్యా సంవత్సరంలో ఈ నెల 2న ఆన్లైన్ ద్వారా ఎంపికలు నిర్వహించారు. జిల్లా నుంచి ముగ్గురు, ఎన్ఐఎఫ్ నుంచి మరో ముగ్గురు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
ఇన్స్పైర్ అవార్డులకు ఎంపికైన విద్యార్థులు, వారికి సహకరించిన స్కూల్ యాజమాన్యం, గైడ్(టీచర్ల)ను డీఈవో రోహిణి అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యేలా ప్రాజెక్టులను రూపొందించాలని ఆమె కోరారు.
స్మార్ట్ గ్యాస్ యంత్ర పరికరాన్ని అమీర్పేట్లోని సిస్టర్ నివేదిదా స్కూల్ విద్యార్థిని మోనోగ్నా తయారు చేశారు. ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయినప్పుడు ఈ సెన్సార్ పరికరం గ్రహించి వెంటనే సైరన్ చేస్తుంది. ఆ క్రమంలో రెడ్లైట్ వెలుగుతుంది. అలాగే కరెంట్ సర్క్యూట్ను బ్రేక్ చేసి ప్రమాదాన్ని అరికడుతుంది -మోనోజ్ఞ దైగాల, 6వ తరగతి
‘పోర్టబుల్ కాంటాక్ట్ లెస్ శానిటైజర్ను ఫిట్జీకి చెందిన పదో తరగతి విద్యార్థి గిరీశ్ సాయి తయారు చేశారు. ఈ పరికరంతో తరుచూ చేతులు శుభ్రం చేసుకోవచ్చు. విద్యార్థులు, వైద్యులు, తరచూ ప్రయాణం చేసేవారికి ఈ పరికరం ఎంతో ఉపయుక్తం. – గిరీశ్ సాయి, 10వ తరగతి
విస్తరించే గిడ్డంగిని బహుదూరపురలోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థి రూపొందించారు. -మహ్మద్ జక్రియ, 8వ తరగతి
స్మార్ట్ కేబుల్ ప్లవ్ యంత్రాన్ని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సాయి చిత్రేజ్ ఉన్నా అనే విద్యార్థి తయారు చేశారు. ఇదో వ్యవసాయ పరికరం. ఇది భూమిని దున్నడంతో పాటు ఒకేసారి విత్తనాలు వెదజల్లుతుంది. ఈ పరికరంతో ఎంతో సమయం ఆదా అవడం ఖాయం.
శ్రమ కూడా తక్కువే. -సాయి చిత్రేజ్ ఉన్నా, 8వ తరగతి
మనుషులతో సంబంధం లేకుండా మానవ వ్యర్థాలను తొలగించేందుకు రిమోట్ కంట్రోల్ స్క్రాప్ క్లీనర్ పరికరాన్ని సెయింట్ అల్ఫాన్సస్కు చెందిన బందా హర్షిత అనే విద్యార్థి తయారు చేశారు. – బందా హర్షిత
యుద్ధాలు వచ్చినప్పుడు, శత్రువులు దాడి చేసినప్పుడు సైనికులు గాయపడకుండా ఉండేందుకు సియాచిన్ బ్యాగ్ను రాక్స్ఫార్డ్ వాల్యూ హైస్కూల్ విద్యార్థి సోహాన్కుమార్ తయారు చేశారు. ఇందులో జీపీఎస్తో పాటు ఎల్ఈడీ లైట్లను అమర్చారు. – ఆర్.సోహాన్ కుమార్, 8వ తరగతి
తడి, పొడి చెత్తను వేరు చేసేలా స్మార్ట్ డస్ట్బిన్ను బహదూర్పురలోని సెయింట్ మార్క్ బాయ్స్ టౌన్ స్కూల్ విద్యార్థి షేక్ యాహియా రూపొందించారు. ఇది ముఖ్యంగా వంటగదిలో ఉన్న చెత్తను త్వరగా శుభ్రం చేస్తుంది.-షేక్ యాహియా, 7వ తరగతి
నిల్వ చేసిన ఆహార ధాన్యాల్లో క్రిమికీటకాలను చంపే అతి తక్కువ ఖర్చుతో కూడిన క్రిమి సంహారక పరికరాన్ని నాంపల్లిలోని జీజీహెచ్ఎస్లో 9వ తరగతి చదువుతున్న సైదా బేగం రూపొందించారు. -సైదా బేగం, 9వ తరగతి
కొవిడ్ లక్షణాల్లో ఒకటైన స్వల్ప జ్వరాన్ని గుర్తించే జ్వర బ్యాడ్జిని హిమాయత్నగర్లోని సెయింట్పాట్ హైస్కూల్కు చెందిన 9వ తరగతి విద్యార్థి అమర్త్య వరహాల కనుగొన్నారు. ఇది రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైంది. యూనిఫాంపై ఈ బ్యాడ్జిని ధరిస్తే విద్యార్థికి స్వల్ప జ్వరం (99 డిగ్రీలు) వస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది. దీంతో ఆ విద్యార్థికి సరైన వైద్యం అందించడం వీలవుతుంది. – అమర్త్య వరహాల, తొమ్మిదో తరగతి
ఎలాంటి ఆపరేటర్లు లేకుండానే నదులు, ఇతర జలవనరుల్లోని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను స్వయంగా సేకరించి స్టోరేజీ పాయింట్కు పంపిస్తుంది. ఈ ప్రాజెక్టును మారేడుపల్లికి చెందిన సీతాఫల్ మండి హైస్కూల్ ఫర్ బాయ్స్ అండ్ గల్స్కు చెందిన పెండా సృతి రూపొందించారు. -పెండాసృతి, 9వ తరగతి
కాంటాక్ట్ లెస్ ఫుడ్ డెలివరీ కోసం ‘స్మార్ట్ రోబోటిక్ వాటర్’ను గోల్కొండ కేంద్రియ విద్యాలయం నంబర్-2 విద్యార్థి యాష అగర్వాల్ రూపొందించారు. కరోనా నేపథ్యంలో హోటళ్లలో కొనుగోలుదారులు, ఉద్యోగుల భద్రత కోసం ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చు. -యాష్ అగర్వాల్, 9వ తరగతి
ఫ్లోర్ శానిటైజింగ్ అండ్ మోపింగ్ మూవర్ అనే ప్రాజెక్టును న్యూపారామౌంట్ స్కూల్ విద్యార్థిని ఎం.శరణ్య తయారు చేసింది. ఇది గృహాలు, దుకాణాల్లో ఫ్లోర్లను శుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నది. ఈ యంత్రం నడపడం ఎంతో తేలిక. – ఎం.శరణ్య, 6వ తరగతి
సోలార్ స్మార్ట్ ఫార్మర్ ఫ్రెండ్లీ రోబోను శ్రీగురుదత్తా హైస్కూల్ విద్యార్థి కే శ్రీవాత్సవ తయారు చేశారు. పంటను రక్షించడంతో పాటు పురుగులు, ఇతర జీవులను తరిమేసేందుకు ఈ రోబో పని చేస్తుంది.-కే శ్రీవాత్సవ, 10వ తరగతి
వయో వృద్ధులను ప్రమాదకర పరిస్థితుల నుంచి రక్షించేందుకు అసిస్టెంట్ టు ఎల్డర్ పీపుల్ యాప్ను ఆల్ సెయింట్ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి కొండవీటి హర్షితారామ్ రూపొందించారు. ఆహారం, వ్యాయామం చేయడంలో తోడ్పడుతుంది. అత్యవసర సమయంలో మద్దతు ఇచ్చేలా ఏఈపీ అనే బటన్ను ఈ ప్రాజెక్టులో భాగంగా రూపొందించారు. – కొండవీటి హర్షితారామ్, 7వ తరగతి
ఒక బౌల్ నుంచి మరొక బౌల్లోకి వస్తువులను మార్చేందుకు వీలుగా ‘హ్యాండీ స్పూన్’ను మారేడ్పల్లి సాక్రెడ్ స్కూల్కు చెందిన పసుల నిర్జాల రూపొందించారు. ఈ పరికరాన్ని ఇనుముతో దీర్ఘచతురస్రాకారంలో తయారు చేశారు.- పసుల నిర్జాల, 7వ తరగతి