Attritions in IT Sector | కరోనా తర్వాత ప్రతిభావంతులైన ఐటీ నిపుణుల కోసం సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థలు జల్లెడ పడుతున్నాయి. ఇతర సంస్థల్లో పని చేస్తున్న ప్రతిభావంతులకు మెరుగైన వేతన ప్యాకేజీలతో ఆకట్టుకుంటున్నాయి. దీనికే ఐటీ సంస్థలు అట్రిక్షన్ (వలసలు – Attritions) ముద్దుపేరు పెట్టాయి. దీంతో ఆయా ఐటీ దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులు ఇతర సంస్థల్లోకి వలస వెళ్లకుండా భారీ వేతన ప్యాకేజీలు అమల్లోకి తీసుకొస్తున్నాయి. వేతనాలు పెంచినా మెరికల్లాంటి ఐటీ నిపుణులు ఇతర సంస్థల ఆకర్షణీయ ప్యాకేజీల వైపు మొగ్గుతున్నారు.
ఫలితంగా ఉద్యోగుల వలసలను అరికట్టడానికి చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్న ఐటీ సంస్థలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆయా ఐటీ సంస్థల ఆర్థిక ఫలితాలు అందుకు అద్దం పడుతున్నాయి. ఉద్యోగులను కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్న ఐటీ సంస్థలకు అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ పతనం వల్ల వచ్చిన లాభాలు కూడా తగ్గిపోయాయి. కానీ, వేతనాలు పెంచినా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అట్రిక్షన్ ఊసు మరవడం లేదు.
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా వంటి సంస్థల ఆదాయం, కాంట్రాక్ట్లు బాగానే ఉన్నా.. లాభాలు మాత్రం కొడిగట్టుకుపోయాయి. ప్రత్యేకించి వలసల ప్రభావం ఇన్ఫోసిస్పైనే ఎక్కువగా ఉంది. ఈ సంస్థ తొలి నుంచి అట్రిక్షన్లను నివారించడానికి 0.75 నుంచి ఒకశాతం పరిహారం చెల్లించడం ప్రామాణికంగా పెట్టుకున్నది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ తన నిపుణులను రక్షించుకోవడానికి 1.6 శాతం పరిహారం చెల్లించామని తన తొలి త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించింది. రెండో త్రైమాసికంలోనూ మరో పరిహార ప్యాకేజీ అమలు చేయాల్సి రావచ్చునని ముందే సంకేతాలిచ్చింది. ఫలితంగా 23 శాతం వరకు వచ్చే ఇన్ఫోసిస్ మార్జిన్లు 20.1 శాతానికి పరిమితం అయ్యాయి.
ఉద్యోగుల ప్రతిభ, నైపుణ్యాన్ని బట్టి ఐటీ సంస్థలు పరిహారం.. వేతన ప్యాకేజీ పెంచేందుకు వెనుకాడటం లేదు. ఇన్ఫోసిస్, టీసీఎస్ కంటే అత్యధికంగా ఉద్యోగులను కాపాడుకోవడానికి విప్రో తమ మార్జిన్లలో రెండు శాతం వేతన ప్యాకేజీలకు ఖర్చయిందని తెలిపింది. ఫలితంగా జూన్ త్రైమాసికంలో విప్రో మార్జిన్ 15 శాతానికి పరిమితమైంది.
టీసీఎస్ తన ఉద్యోగుల వార్షిక వేతనాలు పెంచేయడంతో తమ మార్జిన్లపై 1.5 శాతం ప్రభావం పడిందని తెలిపింది. ఉద్యోగుల వేతనాలు ఐదు నుంచి ఎనిమిది శాతం పెంచేసింది. ఫలితంగా 24 శాతం వరకు రావాల్సిన మార్జిన్లు 23.1 శాతంతోనే టీసీఎస్ సరిపెట్టుకున్నది.
ఇదిలా ఉంటే మార్చితో ముగిసిన (2021-22) చివరి త్రైమాసికంలో ఇన్ఫోసిస్లో 27.7 శాతం మంది నిపుణులు అట్రిక్షన్ బాట పడితే, గత త్రైమాసికంలో 28.4 శాతానికి పెరిగింది. హెచ్సీఎల్ టెక్లో గతేడాది చివరి త్రైమాసికంలో 21.3 శాతం మంది ఐటీ నిపుణులు వలస వెళితే, జూన్ త్రైమాసికం (2022-23)లో 23.8 శాతానికి చేరుకున్నది. టీసీఎస్లో 17.4 నుంచి 19.7 శాతానికి చేరితే, విప్రోలో 23.8 నుంచి 23.3 శాతానికి తగ్గింది.