న్యూఢిల్లీ, అక్టోబర్ 13: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్…విశ్లేషకుల అంచనాల్ని మించిన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గతేడాది ఇదేకాలంలో పోలిస్తే 11.9 శాతం వృద్ధితో రూ.5,421 కోట్లకు చేరింది. 2020 సెప్టెంబర్ క్వార్టర్లో ఈ లాభం రూ.4,845 కోట్లు. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో ఆర్జించిన రూ.5,195 కోట్లకంటే సెప్టెంబర్ క్వార్టర్లో లాభం 4.4 శాతం వృద్ధిచెందింది. తాజాగా ఆదాయం గతేడాదికంటే 20.5 శాతం వృద్ధితో రూ.24,570 కోట్ల నుంచి రూ.29,602 కోట్లకు పెరిగినట్లు ఇన్ఫోసిస్ బుధవారం తెలిపింది. సీక్వెన్షియల్గా ఆదా యం 6.1 శాతం అధికమయ్యింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.15 చొప్పున మధ్యంతర డివిడెండును సిఫార్సుచేసింది. ఇన్ఫోసిస్ వెల్లడించిన వివరాలివి…
2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రెవిన్యూ 16.5-17.5 శాతం మేర వృద్ధి చెందుతుందని తెలిపింది.
45,000 ఫ్రెషర్ల నియామకాలు
సాఫ్ట్వేర్ సర్వీసులకు భారీ డిమాండ్ ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఏడాది 45,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. సర్వీసుల డిమాండ్తో పాటు మరోవైపు వలసలు పెరుగుతున్నందున రిక్రూట్మెంట్స్ను పెంచింది. జూన్ క్వార్టర్లో 13.9 శాతం ఉన్న ఉద్యోగుల వలసలు సెప్టెంబర్ క్వార్టర్లో 20.1 శాతానికి చేరినట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్ అవకాశాల్ని పూర్తిగా అందిపుచ్చుకునేందుకు ఈ ఏడాది 45 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ సీవోవో యూబీ ప్రవీణ్రావు తెలిపారు.
‘భారీ డీల్స్ రావడంతో మా విశ్వాసం పెంపొందింది. అందుకే రెవిన్యూ గైడెన్స్ను పెంచుతున్నాం. కొవిడ్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచీ భారత ఐటీ సర్వీసుల రంగానికి… క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో భారీ అవకాశాలొస్తున్నాయ్’-సలీల్ పరేఖ్ సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్
ఐటీ పోర్టల్ చక్కబడింది
ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్ సాంకేతిక సమస్యల్ని చాలావరకూ పరిష్కరించామని, ఇప్పటివరకూ ఈ పోర్టల్ ద్వారా 1.9 కోట్ల రిటర్న్లు దాఖలయ్యాయని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. 3.8 కోట్ల మంది యూజర్లు వారి లావాదేవీల్ని పూర్తిచేశారని, ప్రతీ రోజూ 2-3 లక్షల రిటర్న్లు ఫైల్ అవుతున్నాయన్నారు. కాగా, కంపెనీ సీవోవో ప్రవీణ్రావు డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు.