పనాజీ: దేశంలో తొలి లిక్కర్ మ్యూజియం గోవాలో ప్రారంభమైంది. ఉత్తర గోవాలోని కాండోలిమ్ గ్రామంలో ‘ఆల్ అబౌట్ ఆల్కహాల్’ మ్యూజియాన్ని స్థానిక వ్యాపారవేత్త నందన్ కుడ్చడ్కర్ ఏర్పాటు చేశారు. శతాబ్దాల నాటి జీడిపప్పు ఆధారిత ఆల్కహాల్ నిల్వ పాత్రలు, సాంప్రదాయ గాజు సీసాలతోపాటు ఫెనితో ముడిపడిన వందలాది కళాఖండాలు ఈ లిక్కర్ మ్యూజియంలో ఉన్నాయి. గోవాకు చెందిన గొప్ప వారసత్వం, ముఖ్యంగా బలమైన స్థానిక పానీయం-ఫెని గురించి ప్రపంచానికి తెలియజేయడం ఈ మ్యూజియం ఏర్పాటు వెనుక ఉన్న ఆలోచన అని పురాతన వస్తువుల కలెక్టర్ అయిన నందన్ తెలిపారు.
‘నేను ఇలాంటి కాన్సెప్ట్ను రూపొందించాలని అనుకున్నప్పుడు, నా మనసులో వచ్చిన మొదటి ఆలోచన ఏమిటంటే, ప్రపంచంలో ఆల్కహాల్ మ్యూజియం ఉందా అని. ప్రపంచంలో ఎక్కడైనా ఆల్కహాల్కు సంబంధించిన వస్తువులను చూడగలిగే ప్రదేశం ఖచ్చితంగా లేదు. మీరు స్కాట్లాండ్కి వెళితే, వారు తమ జలాల గురించి, వారి పానీయాల గురించి చాలా సంతోషంగా చెబుతారు. అదే విధంగా రష్యా ప్రజలు తమ వద్ద ఉన్న డ్రింక్స్ను ఎంతో సంతోషంగా ప్రదర్శిస్తారు’ అని ఆయన అన్నారు.
ఇక భారతదేశం విషయానికి వస్తే, ఆల్కహాల్ను మనం విభిన్నంగా ప్రొజెక్ట్ చేస్తామని నందన్ చెప్పారు. తన ప్రవృత్తిని అనుసరించి ఆల్కహాల్కి అంకితమైన భారతదేశపు మొట్టమొదటి మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
‘మా ప్రముఖ పానీయాలలో ఒకటి కాజు ఫెని. దీనిని ఇక్కడ ప్రదర్శించాం. ఈ పానీయం సహజంగా పులియబెట్టింది. మద్యం సేవించడం ఆతిథ్యానికి చిహ్నంగా గోవా ప్రజలు భావిస్తారు’ అని ఆల్కహాల్ మ్యూజియం సీఈవో అర్మాండో డువార్టే తెలిపారు.
కాగా, ఈ లిక్కర్ మ్యూజియంలో భద్రపరిచిన సమాచారం అద్భుతమైందని ఒక టూరిస్ట్ తెలిపారు. ఈ మ్యూజియాన్ని చూసి తాను చాలా ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. సందర్శకుల కోసం వారు ఇక్కడ ఉంచిన సమాచారం చాలా అద్భుతంగా ఉందన్నారు.