అంతరిక్షం
ఉపగ్రహ అభివృద్ధికి విధాన రూపకల్పన
భారత ఉపగ్రహ ఆధారిత దిక్సూచి, ఆగ్మెంటేషన్ సేవల్లో వ్యవస్థల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలకు ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకురానున్న ఒక విధానాన్ని ఆగస్ట్లో ప్రకటన చేసింది. ఇండియన్ శాటిలైట్ నావిగేషన్ పాలసీ (శాట్నావ్ పాలసీ-2021) పేరుతో రానుంది.
జీఎస్ఎల్వీ ప్రయోగం విఫలం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆగస్ట్ 12న చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 ప్రయోగం విఫలమైంది. ఈ వాహక నౌక ద్వారా ఈవోన్-03 ఉపగ్రహాన్ని భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. క్రయోజనిక్ దశలో రాకెట్లో సాంకేతిక లోపం తలెత్తింది, దీంతో వాహన నౌక గతి తప్పింది. మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం విఫలమయ్యింది.
సోలార్ ప్రోబ్
నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌక సూర్యుడి బాహ్య వాతావరణ పొరను డిసెంబర్లో తాకింది. అక్కడ ఉష్ణోగ్రత 11 లక్షల డిగ్రీల సెల్సియస్కు పైగా ఉంటుంది. పార్కర్ ప్రోబ్ను 2018లో ప్రయోగించారు. ఇది కరోనా పొరలోకి తొలిసారి 2021 ఏప్రిల్ 28న ప్రవేశించింది.
ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ప్రారంభం
ఇండియన్ స్పేస్ అసోసియేషన్ను ప్రధాని మోదీ అక్టోబర్ 11న ప్రారంభించారు. అంతరిక్ష, ఉపగ్రహ సాంకేతికతల్లో అత్యంత నైపుణ్యాలు, సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో ఇండియన్ స్పేస్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. దీని వ్యవస్థాపక సంస్థల్లో లార్సన్ అండ్ టూబ్రో, నెల్కో, వన్వెబ్, భారతీ ఎయిర్టెల్, మ్యాప్ మై ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి.
రాతి నమూనా సేకరణ
అమెరికా అంతరిక్ష సంస్థకు చెందిన పర్సివరెన్స్ రోవర్ సెప్టెంబర్లో అంగారకుడిపై రాతి నమూనాను సేకరించింది. కొన్నేళ్ల తర్వాత దీనిని భూమికి తీసుకువస్తారు. ఆ గ్రహంపై ఉన్న జెజెరో బిలంలో 2021 ఫిబ్రవరిలో పర్సెవరెన్స్ దిగింది.
అంతరిక్ష ప్రైవేట్ యాత్ర
నలుగురు యాత్రికులతో స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన క్య్రూ డ్రాగన్ ఈ ఏడాది సెప్టెంబర్లో నింగిలోకి వెళ్లింది. పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులతో కూడిన వ్యోమనౌక ఒకటి భూమి కక్ష్యలో పరిభ్రమించడం ఇదే తొలిసారి.
కృత్రిమ సూర్యుడిని సృష్టించిన చైనా
కృత్రిమ సూర్యుడిని సృష్టించే యత్నంలో చైనా విజయవంతం అయింది. 288 మిలియన్ ఫారెన్హీట్ డిగ్రీల ఉష్ణోగ్రతతో కృత్రిమంగా ప్రయోగం చేసింది. ఇది సూర్యుడి కంటే 10 రెట్లు ఎక్కువ వేడిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగాన్ని ఆ దేశానికి చెందిన ఎక్స్పరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టొకమాక్ అనే న్యూక్లియర్ రియాక్టర్ సాధించింది. గతంలో ఈ తరహా ప్రయోగాన్ని దక్షిణ కొరియా కూడా చేసింది.
అంగారకుడిపైకి చేరిన చైనా రోవర్
అంగారకుడిపైకి చైనా ప్రయోగించిన ఆ దేశ తొలి రోవర్ మే 14న మార్స్పైకి చేరింది. జూలై 2020లో దీనిని లాంగ్ మార్చ్ 5 రాకెట్ను ఉపయోగించి ప్రయోగించారు. చైనా పంపించిన ఈ రోవర్ అంగారక గ్రహం ఉత్తరార్ధ గోళంలో ఉన్న ఉటోపియా ప్లానిటియాలో దిగింది. ఇది అక్కడ మైదాన ప్రాంతం. ఈ రోవర్కు చైనా పెట్టిన పేరు జురోగ్. ఇది ఆ దేశ అగ్ని దేవత పేరు. అరుణగ్రహం ఉపరితల లక్షణాలు, నీరు, విస్తరణ తదితర అంశాలను ఇది అధ్యయనం చేస్తుంది.
పీఎస్ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతం
ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి దీనిని ఫిబ్రవరి 28న ప్రయోగించారు. ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి ప్రధాని మోదీ ఫొటో, అత్మనిర్భర్ మిషన్ పేరు, భగవద్గీత కాపీలను కూడా పంపారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. దేశీయ, ప్రైవేట్ సంస్థలకు చెందిన 10 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. 50 సంవత్సరాల ఇస్రో చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. బ్రెజిల్కు చెందిన అమెజానియా-1తో పాటు భారత్కు చెందిన అయిదు, అమెరికాకు చెందిన 13 మైక్రో ఉపగ్రహాలను అంతరిక్షానికి పంపారు. 50 సంవత్సరాల ఇస్రో చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ఇదే ప్రథమం.
యూఏఈ వ్యోమనౌక: అంగారక గ్రహ కక్ష్యలోకి వ్యోమనౌకను విజయవంతంగా ఫిబ్రవరి 9న యూఏఈ ప్రవేశపెట్టింది. అరబ్ దేశాలకు ఇదే తొలి గ్రహాంతర యాత్ర. అమల్ అనే ఈ వ్యోమనౌక ఏడు నెలల పాటు 30 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 10న చైనాకు చెందిన తియాన్వెన్-1, ఫిబ్రవరి 18న అమెరికాకు చెందిన పర్సివరెన్స్ రోవర్ ఈ గ్రహంపైకి చేరనున్నాయి. వీటిని 2020 జూలైలో ప్రయోగించారు.
రక్షణ రంగం
లూసీ ప్రయోగం
సౌరకుటుంబంలోని ఎనిమిది గ్రహశకలాల రహస్యాలను తెలుసుకొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అక్టోబర్ 16న లూసీ అనే వ్యోమనౌకను ప్రయోగించింది. 12 సంవత్సరాల పాటు ఇది 630 కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
ప్రళయ్ క్షిపణి
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్త తరం క్షిపణి ప్రళయ్ తొలి ప్రయోగ పరీక్షను విజయవంతంగా డిసెంబర్ 22న పూర్తి చేసింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే క్షిపణి.
టార్పిడో
చాలా దూరంలో ఉన్న శత్రు జలాంతర్గామిని అత్యంత కచ్చితత్వంతో పేల్చివేసే అధునాతన ఆయుధ వ్యవస్థను భారత్ డిసెంబర్ 13న విజయవంతంగా పరీక్షించింది.
వేలా జలాంతర్గామి
దేశీయంగా తయారు చేసిన జలాంతర్గామి వేలా నవంబర్ 9న భారత నౌకాదళంలోకి చేరింది. నేవీలో ఇది నాలుగో తరం స్కార్పీన్ రకం జలాంతర్గామి.
ఏడు పీఎస్యూలు జాతికి అంకితం
రక్షణ రంగంలోని ఏడు కొత్త పీఎస్యూలను ప్రధాని మోదీ ఈ ఏడాది అక్టోబర్లో జాతికి అంకితం చేశారు. 200 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ స్థానంలో ఈ ఏడు పీఎస్యూలు ఆవిర్భవించాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్లో 41 ఫ్యాక్టరీలు, 9 అనుబంధ సంస్థలు ఉండేవి. వాటన్నింటిని విలీనం చేసి ఏడు కొత్త ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చారు.
చాఫ్ వ్యవస్థ అభివృద్ధి
శత్రు దేశాలు ప్రయోగించే రాడార్ గైడెడ్ క్షిపణుల నుంచి యుద్ధ విమానాలను కాపాడుకొనేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అధునాతన చాఫ్ పరిజ్ఞానాన్ని ఆగస్ట్లో అభివృద్ధి చేసింది. శత్రు రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ నుంచి యుద్ధ విమానాన్ని రక్షించే వ్యవస్థలో ఒక భాగమే చాఫ్ వ్యవస్థ. అధునాతన శత్రు క్షిపణుల నుంచి పోరాట విమానాలను రక్షించుకొనేందుకు కౌంటర్ మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్ను వినియోగిస్తారు. ఇందులోనే చాఫ్ వ్యవస్థ భాగం.
నౌకాదళానికి అధునాతన వ్యవస్థ
ల్యాండింగ్ గేర్ వ్యవస్థలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ నౌకాదళానికి జనవరి 10న డీఆర్డీవో అప్పగించింది. ఇవి మానవ రహిత విమానాలు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
పర్యావరణ అంశాలు
రామ్సర్ జాబితాలో అయిదు చిత్తడి నేలలు
రామ్సర్ జాబితాలో భారత్ తరఫున ఈ ఏడాది అయిదు చిత్తడి నేలలను చేర్చారు. అవి రెండు హర్యానాలో, రెండు గుజరాత్లో మరొకటి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఆగస్ట్లో హర్యానా, గుజరాత్ల ప్రదేశాలను ఈ జాబితాలో చేర్చగా, ఉత్తరప్రదేశ్లోని దానిని డిసెంబర్లో చేర్చారు. రాష్ర్టాల వారీగా ప్రదేశాలు..
హర్యానా- సుల్తాన్ పూర్ నేషనల్ పార్క్, భిందవాస్ వన్య మృగసంరక్షణ కేంద్రం
గుజరాత్- థోల్ సరస్సు, వాద్వానా చిత్తడి నేల ఉత్తరప్రదేశ్- హైదర్పూర్ చిత్తడి నేల
ఈ అయిదింటితో భారత్లో రామ్సర్ సైట్ల సంఖ్య 47కు చేరింది. అతి ఎక్కువగా ఈ రామ్సర్ సైట్లు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
పర్యావరణ అనుకూల శైలికి మద్దతు
పర్యావరణ అనుకూల జీవన శైలిని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని, దీనిని ప్రపంచ కార్యక్రమంగా మార్చాలని ప్రధాని మోదీ సూచించారు. గ్లాస్గోలో నిర్వహించిన కాప్26 సదస్సులో ఆయన నవంబర్ 1న ప్రసంగించారు. ప్రపంచ జనాభాలో 17% వాటా కలిగిన భారత్ మొత్తం ఉద్గారాల్లో కేవలం 5% వాటా మాత్రమే కలిగి ఉందన్నారు.
పర్యావరణ సున్నిత ప్రాంతంగా శ్రీశైలం రిజర్వ్
నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వ్ చుట్టూ 2,149,68 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ రిజర్వ్ సరిహద్దు చుట్టూ జీరో నుంచి 26 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని దీనిలో భాగంగా చేస్తూ అక్టోబర్ 22న నోటిఫికేషన్ను జారీ చేశారు.
ప్లాస్టిక్ ఒప్పందం
ప్లాస్టిక్ ఒప్పందాన్ని సెప్టెంబర్ 3న భారత్ కుదుర్చుకుంది. ఆసియాలో ఈ ఒప్పందాన్ని చేసుకున్న తొలి దేశం భారత్. వరల్డ్-వుడ్ ఫండ్ ఫర్ నేచర్తో ఈ ఒప్పందం జరిగింది. ప్యాకింగ్కు ఉపయోగించే ప్లాస్టిక్ను 100% పునర్ వినియోగించేలా చూస్తారు.
ప్లాస్టిక్ నిషేధం: ప్లాస్టిక్ వృథా నిర్వహణ సవరణ నిబంధనలు-2021ను ఇటీవల పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్ను 2022 జూలై 1 నుంచి తయారు చేయడం, దిగుమతి, నిల్వ, సరఫరా, అమ్మకం, ఉపయోగించడం నిషేధం అవుతుంది. కంపోస్టబుల్ ప్లాస్టిక్పై ఎలాంటి నిషేధం ఉండదు. పెట్రో రసాయనాలు, శిలాజ ఇంధనాలతో కాకుండా ఆలు తదితర పిండి పదార్థాల నుంచి తయారు చేసే ప్లాస్టిక్ను కంపోస్టబుల్ ప్లాస్టిక్ అంటారు. ఈ తరహా ప్లాస్టిక్ నశిస్తుంది.
వాణిజ్య వ్యవహారాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం 2017-18లో భారత్ రోజు 26,000 టన్నుల ప్లాస్టిక్ వృథాను ఉత్పత్తి చేసింది.
ఫిట్ ఫర్ 55
కార్బన్ ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్ ఫిట్ ఫర్ 55ను ప్రారంభించాయి. యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. 2030 నాటికి 55% ఉద్గారాలను తగ్గిస్తారు. రవాణా రంగంలో భారీ మార్పులు తీసుకురానున్నారు. దహనం చేసే ఇంజిన్ల ఉత్పత్తిని 2030 నుంచి తగ్గించనున్నారు. శిలాజ ఇంధనాల స్థానంలో సుస్థిర, ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వెళ్లే దేశాలకు భారీ ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.
ప్రకృతి ఆర్థిక స్థితి నివేదిక
ప్రకృతి ఆధార పరిష్కారాలు, శీతోష్ణస్థితి మార్పు, జీవ వైవిధ్యం, భూ అధోకరణం తదితరాలను తట్టుకోవాలంటే నిధుల ప్రవాహం అవసరమని ఐక్యరాజ్య సమితి జూన్లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీనిని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, ప్రపంచ ఆర్థిక ఫోరం, ఎకనామిక్స్ ఆఫ్ ల్యాండ్ డీగ్రేడేషన్ అనే సంస్థలు రూపొందించాయి.
ఎల్ఈఎఫ్ ప్రారంభం
అమెరికా, యూకే, నార్వే సంయుక్తంగా ఎల్ఈఎఫ్ను ప్రారంభించాయి. ఉష్ణమండల అడవుల పరిరక్షణకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రారంభించిన అతిపెద్ద కార్యక్రమం ఇది. ఎల్ఈఎఫ్ అంటే లోయరింగ్ ఎమిషన్స్ బై యాగ్జిలరేటింగ్ ఫారెస్ట్ ఫైనాన్స్. అంటే అడవుల పరిరక్షణకు ఆర్థికంగా చేయూతను ఇవ్వడం ద్వారా ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించడం. యూనిలివర్, అమెజాన్, నెస్టిల్ తదితర సంస్థలు ఇందుకు సాయం చేస్తున్నాయి.
కిగాలి ఒప్పందం
కిగాలి సవరణ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైడ్రోఫ్లోరో కార్బన్లను దశల వారీగా లేకుండా చేయడమే ఈ ఒప్పందం కీలక అంశం. మాంట్రియల్ ప్రోటోకాల్కు కిగాలిలో చేసిన సవరణ, కిగాలి సవరణ ఒప్పందంగా చెబుతారు. జూలై 2021 నాటికి మొత్తం 122 దేశాలు కిగాలి ఒప్పందాన్ని ఆమోదించాయి.
ఎస్వోపీ రూపకల్పన
పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించి పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక నిర్ణీత కార్యాచరణ విధానాన్ని రూపొందించింది. దీనినే ఇంగ్లిష్లో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్గా చెప్పవచ్చు. 2021లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో ఈ విధానాన్ని జూలైలో రూపొందించారు. పర్యావరణ అనుమతి లేకుండా ప్రాజెక్ట్ చేపట్టినా లేదా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ను విస్తరించినా ఉల్లంఘన కిందే పరిగణిస్తారు.
ఇతర అంశాలు
కొత్త వంగడాల అభివృద్ధి
కరవు ప్రాంతంలో వాతావరణ మార్పులను తట్టుకొని పండే 3 రకాల శనగ వంగడాలను ఇక్రిశాట్ అక్టోబర్లో విడుదల చేసింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి అనుబంధ సంస్థలతో కలిసి వీటిపై పరిశోధనలు చేసి సత్ఫలితాలు సాధించింది ఇక్రిశాట్. ఈ విత్తనాలకు పెట్టిన పేర్లు-బీజీఎం-4005, ఐపీసీఎల్4-14, ఐపీసీఎంబీ19-3
జన్యు సమాచార టూల్
మానవ జన్యువులను కేవలం 30 సెకన్లలో విశ్లేషించడంతో పాటు ఒక్కో వ్యక్తి జన్యుక్రమాన్ని కేవలం 40 నిమిషాల్లో తెలుసుకొనేలా సరికొత్త టూల్ను సీసీఎంబీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
జియో స్పేషియల్ మ్యాప్
దేశంలోని శక్తి వనరులకు సంబంధించి ఒక జియో స్పేషియల్ ఎనర్జీ మ్యాప్ను నీతి ఆయోగ్ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు ఇస్రో సహకరించింది. ఈ మ్యాప్ సహాయంతో భారత్లోని ప్రాథమిక, ద్వితీయ శక్తి వనరులను గుర్తించడం, వాటి బదిలీ/రవాణాకు కూడా వీలు కలుగుతుంది.
లిథియం అన్వేషణ
దేశంలోని ఆరు రాష్ర్టాల్లో ఏడు లిథియం ప్రాజెక్ట్లను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టింది. అవి.. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్.
డీప్ ఓషన్ మిషన్
సముద్రాల్లోని సహజ వనరుల అన్వేషణ, వెలికితీతకు డీప్ ఓషన్ మిషన్ను భారత్ చేపట్టనుంది. ఇందుకు రానున్న అయిదు సంవత్సరాల్లో రూ.4077 కోట్లు వ్యయం చేయనున్నారు. తొలి దశ కింద తొలి మూడేళ్లలో (2021-24) రూ.2823.4 కోట్లు వెచ్చించనున్నారు. భూసార మంత్రిత్వ శాఖ దీనిని పర్యవేక్షిస్తుంది. 7517 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, 1382 ద్వీపాలు ఉన్న భారత్ డీప్ ఓషన్ మిషన్ను చేపట్టనుంది.
అంబిటాగ్ ఆవిష్కరణ
ఏ సమయంలో అయినా ఉష్ణోగ్రతను కొలిచేందుకు ఐఐటీ రోపర్ శాస్త్రవేత్తలు అంబిటాగ్ను జూన్లో అభివృద్ధి చేశారు. వ్యాక్సిన్లు, దేహ భాగాలు లేదా కుళ్లిపోయే అవకాశం ఉన్న పదార్థాలు ఒకచోట నుంచి ఇంకో చోటుకు తీసుకెళ్తున్నప్పుడు ఉష్ణోగ్రత ఎప్పుడైనా నమోదు చేసేందుకు దీని ద్వారా వీలుంటుంది.
జాతీయ జీన్ బ్యాంక్
ప్రపంచంలో రెండో అతిపెద్ద జీన్ బ్యాంక్ను ఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ప్రాంగణంలో ఆగస్ట్లో ప్రారంభించారు. జన్యు పదార్థాలను నిల్వ చేసే బ్యాంక్లనే జీన్ బ్యాంక్ అంటారు. విత్తనాలు, కణజాల వర్ధనాలను కూడా ఇక్కడ నిల్వ చేస్తారు.
క్వాంటమ్ కంప్యూటర్ సిమ్యులేటర్
దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్వాంటమ్ కంప్యూటర్ సిమ్యులేటర్ టూల్ కిట్ను ఆగస్ట్ 27న విడుదల చేశారు. ఈ టూల్ కిట్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూర్), ఐఐటీ రూర్కీ, సీ-డాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) అనువర్తనాల అవగాహనకు ఇది ఉపయోగపడుతుంది.
హైదరాబాద్లో సీఎస్టీ
కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ బేస్డ్ టెస్ట్ రిగ్ ఫెసిలిటీని హైదరాబాద్లో జూలైలో ఏర్పాటు చేశారు. సోలార్ రిసీవర్ ట్యూబ్స్, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్స్, కాన్సన్ట్రేటింగ్ మిర్రర్స్ తదితర సౌర విద్యుత్ పరికరాల సామార్థ్యాన్ని ఇక్కడ పరీక్షించవచ్చు.
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్
విశ్వ ఆవిర్భావ రహస్యాలను తెలుసుకొనేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను డిసెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించారు. కౌరూలోని ఫ్రెంచ్ గయానా వద్ద చేపట్టిన ఈ ప్రయోగంలో ఏడు టన్నుల బరువున్న టెలిస్కోప్ను ఎరియన్-5 రాకెట్ నింగిలోకి తీసుకువెళ్లింది. ఇది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, నిర్దేశించిన ల్యాండ్ రేంజ్ పాయింట్ వద్ద స్థిరపడింది.
సుపరిపాలనలో తెలంగాణ ముందంజ
సుపరిపాలనను అందించడంలో అనేక రంగాల్లో తెలంగాణ పురోగమించింది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 25న విడుదల చేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో పలు గణాంకాలు రాష్ట్ర పురోగతిని సూచిస్తుంది. పబ్లిక్ గ్రీవెన్సెస్ శాఖ 2020-21 సంవత్సరానికి రాష్ర్టాలకు గుడ్ గవర్నెన్స్ ర్యాంక్లను ప్రకటించింది. రాష్ర్టాలను రెండు క్యాటగిరీలుగా, కేంద్ర పాలిత ప్రాంతాలను మరో క్యాటగిరీగా, ఈశాన్య రాష్ర్టాలు, కొండలు, గుట్టలతో కూడిన రాష్ర్టాలను మరో విభాగంగా చేసి ర్యాంక్లను ప్రకటించింది. తెలంగాణ రెండు అంశాల్లో తొలి స్థానంలో, మరో రెండు అంశాల్లో రెండో స్థానంలో నిలిచింది. పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో, సాంఘిక సంక్షేమం, అభివృద్ధి అంశంలోనూ తొలి స్థానాన్ని దక్కించుకుంది. ఆర్థిక నిర్వహణ, ప్రజా మౌలిక సదుపాయాల్లో రెండో ర్యాంక్ను సాధించింది.
ప్రసాద్ పథకంలో భద్రాచలం
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రసాద్ పథకంలో భద్రాచలం భాగం అయింది. పీఆర్ఏఎస్ఏడీ పూర్తి రూపం-పిల్గ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువాలిటీ అగ్యుమెంటేషన్ డ్రైవ్. ఈ పథకంలో భాగంగా ఆధ్యాత్మిక పర్యాటకులకు సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు అవసరమయిన మౌలిక వసతులను కూడా కల్పిస్తారు. పర్ణశాల, సీతవాగు ప్రాంతంలో సైతం నూతన సౌకర్యాలను కల్పించడంతో పాటు ఉన్న వాటిని మెరుగు పరుస్తారు.