న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో దేశంలో హైడ్రోజన్ ఆధారిత ఇంధనంతో నడువనున్నాయి. ఇందుకు భారతీయ రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. 2030 నాటికి హైడ్రోజన్ ఇంధనం ఆధారిత సాంకేతికతతో రైళ్లను నడుపనున్నట్లు ఏజీడీ పీఆర్ఓ రాజీవ్ జైన్ తెలిపారు. త్వరలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా హర్యానా జింద్ – సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల ట్రాక్పై నడిచే డెము (DEMU) రైళ్లలో రీట్రోఫిటింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ఈ నెల 17న ప్రీ బిడ్ కాన్ఫరెన్స్ జరుగుతుందని, ప్రక్రియ అక్టోబర్ 5 వరకు ముగుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హైడ్రోజన్ ఇంధనం పరిశుభ్రమైందని రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ సీఈఓ ఎస్కే సక్సేనా తెలిపారు.
రైలులో డీజిల్ జనరేటర్ను తొలగించి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ను ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలిపారు. దేశంలో హైడ్రోజన్ మొబిలిటీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రస్తావించింది. దీన్ని సవాల్గా స్వీకరిస్తూ ఇండియన్ రైల్వే ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేట్ ఫ్యూయల్ (IROAF).. భారతీయ రైల్వేల గ్రీన్ ఫ్యూయల్ వర్టికల్, రైల్వేస్ నెట్వర్క్పై హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలు కోసం బిడ్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు ఉత్తర రైల్వేలోని 89 కిలోమీటర్ల సోనిపట్ జింద్ విభాగంలో ప్రారంభం కానుంది. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఏటా రూ.2.3కోట్ల ఆదా కానుంది. ఇందుకు ప్రస్తుత సంవత్సరంలో రూ.8కోట్లు రైల్వేశాఖ కేటాయించింది.
ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలైతే తర్వాత విద్యుదీకరణ.. డీజిల్ ఇంధనంపై పని చేసే రైళ్లను హైడ్రోజన్ ఇంధనంపై నడిచేలా చర్యలు తీసుకోవచ్చని రైల్వేశాఖ భావిస్తున్నది. మొదట్లో ముందుగా రెండు డెమూ ర్యాక్లను హైడ్రో ఇంజిన్లుగా మార్చనున్నారు. తర్వాత రెండు హైబ్రిడ్ నారో గేజ్ లోకోమోటివ్లను హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ మూవ్మెంట్తో రీట్రోఫిట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీని చాలా తక్కువ దేశాలు ఉపయోగిస్తున్నాయి. జర్మనీ టెక్నాలజీని వినియోగిస్తుండగా.. పోలాండ్లో ట్రయల్స్ జరుగుతున్నాయి.