న్యూఢిల్లీ : ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) ఆధ్వర్యంలో రైల్ కౌశల్ వికాస్ యోజన (RKVY) కార్యక్రమాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, ఫిట్టర్ కోర్సులపై భారతీయ రైల్వే శిక్షణ ఇవ్వనున్నది. రాబోయే మూడేళ్లలో 50వేల మందికి శిక్షణ ఇవ్వనుండగా.. ప్రారంభంలో వెయ్యి మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా కోర్సుల్లో ప్రాథమికంగా వంద గంటల పాటు శిక్షణ ఉండనుంది.
ప్రాంతీయ డిమాండ్, అవసరాల అంచనా మేరకు జోనల్ రైల్వే, ప్రొడక్షన్ యూనిట్లు, ఇతర ట్రేడ్లలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా పూర్తి పారదర్శకంగా, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 1-35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు కార్యక్రమంలో శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే శిక్షణ ఆధారంగా రైల్వేలో ఉద్యోగం పొందేందుకు ఎలాంటి హక్కు ఉండదని అధికారులు పేర్కొన్నారు.
శిక్షణకు సంబంధించిన పాఠ్యాంశాలను బనారస్ లోకోమోటివ్ వర్క్స్ రూపొందించింది. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం అభ్యర్థులకు నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికెట్తో పాటు ట్రేడ్ టూల్కిట్లు ఇవ్వనున్నారు. ఆర్కేవీవై కింద మారుమూల ప్రాంతాల్లోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణశ్ తెలిపారు. గుణాత్మక మెరుగుదల కోసం వివిధ ట్రేడ్లలో యువతకు శిక్షణ నైపుణ్యాలు అందించడమే ఆర్కేవీవై లక్ష్యమన్నారు. అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని సూచించారు.