Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు (India’s Women Cricket Team) వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandana) టీ20 క్రికెట్ చరిత్రలో సంచలనం సృష్టించింది. తన కెరీర్లో మరో అద్భుతమైన మైలురాయిని అందుకుంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పురుషులు, మహిళల క్రికెట్లో కలిపి అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా ఆమె ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పింది. ఆసియా క్రీడల (Asian Games) సెమీఫైనల్లో బంగ్లాదేశ్ (Bangladesh) తో జరిగిన మ్యాచ్లో ఈ అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకుంది.
కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మంధాన కేవలం 19 బంతుల్లో 37 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ క్రీడాకారిణి సూజీ బేట్స్ పేరిట ఉన్న రికార్డును ఆమె అధిగమించింది. ఈ మ్యాచ్కు ముందు మంధాన 170 ఇన్నింగ్స్లలో 4,751 పరుగులతో రెండో స్థానంలో ఉండగా రికార్డు బ్రేక్ చేయడానికి కేవలం 8 పరుగులు అవసరమయ్యాయి. తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు ఫోర్లు, రెండు సింగిల్స్తో ఈ మార్కును సులభంగా దాటేసింది.
తాజా రికార్డుతో మంధాన 171 ఇన్నింగ్స్లలో 4,788 పరుగులతో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో మంధాన, సూజీ బేట్స్ (4,758) తర్వాత పురుషుల టీ20ల్లో అగ్రగామిగా ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (4,596) మూడో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత జోస్ బట్లర్ (4,292), భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (4,287) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ రికార్డుతో మంధాన పురుషుల క్రికెట్లోని అగ్రశ్రేణి ఆటగాళ్లను కూడా వెనక్కి నెట్టింది.
ఇక ఆసియా క్రీడల సెమీఫైనల్ విషయానికొస్తే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 2023లో జరిగిన హాంగ్జౌ గేమ్స్లో స్వర్ణ పతకం గెలుచుకున్న భారత జట్టు, ఈసారి కూడా టైటిల్ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. అంతకుముందు క్వార్టర్ఫైనల్లో భారత్ ఆతిథ్య జపాన్ను ఓడించి సెమీస్కు చేరుకుంది.