పోచెఫ్స్ట్రోమ్: అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు.. జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన మన అమ్మాయిలు.. క్వార్టర్స్లో ఉత్తర కొరియాను చిత్తు చేశారు. శుక్రవారం జరిగిన కీలక పోరులో భారత్ 3-0తో కొరియాపై జయభేరి మోగించింది. ముంతాజ్ ఖాన్ (11వ ని.లో), లాల్రిండికి (15వ ని), సంగీత కుమారి (41వ ని) ఒక్కో గోల్ నమోదు చేశారు. తొలి క్వార్టర్లోనే రెండు గోల్స్తో తిరుగులేని ఆధిక్యం చేజిక్కించుకున్న మన అమ్మాయిలు.. ఆ తర్వాత ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు. ఇప్పటి వరకు ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఒక్కసారి (2013లో) కాంస్యం నెగ్గిన భారత్.. ఇప్పుడు రెండోసారి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.