ఢిల్లీ : టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ఇండియా వరుసగా రెండో మ్యాచ్లోనూ అదరగొట్టింది. తొలి మ్యాచ్లో బ్యాటర్లు కాస్త తడబడినా గురువారం నమీబియాతో ఢిల్లీ వేదికగా జరిగిన పోరులో మాత్రం మెరుపులు మెరిపించడంతో ప్రత్యర్థిని 93 పరుగుల భారీ తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్కు వచ్చిన భారత్ 20 ఓవర్లకు 209/9 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61, 6 ఫోర్లు, 5 సిక్స్లు), హార్దిక్ పాండ్యా (26 బంతుల్లో 52, 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ శతకాలతో రాణించారు. ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లకు 116కే ఆలౌట్ అయింది. స్టీన్ కాంప్ (29) టాప్ స్కోరర్. వరుణ్ చక్రవర్తి (3/7), అక్షర్ పటేల్ (2/20) స్పిన్ మాయకు తోడు బ్యాట్తో అదరగొట్టిన హార్ధిక్.. బంతి (2/21)తోనూ రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆల్రౌండ్ షో తో రాణించిన హార్దిక్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
నమీబియా ఆహ్వానం మేరకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ను కోల్పోయింది. అభిషేక్ ఇంకా కోలుకోకపోవడంతో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ (8 బంతుల్లో 22, 1 ఫోర్, 3 సిక్స్లు) రెండో ఓవర్లో 6 ,6, 4తో ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. కానీ మరో ఎండ్లో తిలక్ వర్మ (25) తో కలిసి ఇషాన్ బ్యాట్ ఝుళిపించాడు. స్మిత్ వేసిన ఆరో ఓవర్లో ఏకంగా 6, 6, 6, 6, 4తో 28 రన్స్ రాబట్టి 20 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఇషాన్ మెరుపులతో ఏడు ఓవర్లలోనే భారత స్కోరు 104/1తో పటిష్టమైన స్థితిలో నిలిచింది. అయితే 8వ ఓవర్లో ఎరాస్మస్.. ఇషాన్ను ఔట్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. యూఎస్ఏతో మ్యాచ్లో రాణించిన కెప్టెన్ సూర్య (12).. బెర్నార్డ్ బౌలింగ్లో స్టంపౌట్ అవగా తర్వాతి ఓవర్లోనే ఎరాస్మస్, తిలక్నూ ఔట్ చేయడంతో 20 పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. కానీ హార్దిక్, దూబె (23) ఐదో వికెట్కు 39 బంతుల్లోనే 81 రన్స్ జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. ఆరంభం నుంచే వేగంగా ఆడిన ఈ ఇద్దరూ.. 15వ ఓవర్లో 24, 16వ ఓవర్లో 16 రన్స్ పిండుకున్నారు. ఎరాస్మస్ ఒకే ఓవర్లో హార్దిక్, దూబెతో పాటు అక్షర్నూ ఔట్ చేసి పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశాడు.
నమీబియా టపాటపా : నిర్దేశిత 210 పరుగుల లక్ష్యఛేదనలో నమీబియా నిలకడ ప్రదర్శించలేకపోయింది. ఓపెనర్లు లారెన్ స్టీన్కాంప్(29), జాన్ ఫ్రైలింక్(22)ఒకింత మెరుగైన శుభారంభం అందించినా దాన్ని కొనసాగించడంలో విఫలమయ్యారు. ఈ ఇద్దరు టీమ్ఇండియా బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలతో ఆకట్టుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో ఫ్రైలింక్ను అర్ష్దీప్(1/36) ఔట్ చేయడం ద్వారా వికెట్ల ఖాతా తెరిచాడు. పవర్ప్లే ముగిసే సరికి నమీబియా వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. కెప్టెన్ ఎరాస్మస్(18) వచ్చి రావడంతో దూకుడు ప్రదర్శించినా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. హార్దిక్పాండ్యా(2/21), వరుణ్చక్రవర్తి(3/7), అక్షర్పటేల్(2/20) వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి భారత భారీ విజయంలో కీలకమయ్యారు.
భారత్: 20 ఓవర్లకు 209/9 (ఇషాన్ 61, శివమ్ 52, ఎరాస్మస్ 4/20, షికొంగొ 1/41);
నమీబియా: 18.2 ఓవర్లకు 116 ఆలౌట్ (స్టీన్ కాంప్ 29, ఫ్రైలింక్ 22, వరుణ్ 3/7, అక్షర్ 2/20)