Independence Day 2023 | మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ 1751 డిసెంబర్ 1న బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో జన్మించాడు. తండ్రి హైదర్ అలీ మరణానంతరం 1782 డిసెంబర్లో మైసూరు గద్దెనెక్కాడు. అరేబియా సముద్ర తీరంలో ఉన్న మలబార్ (కేరళ) ప్రాంతం టిప్పు సుల్తాన్ నియంత్రణలో ఉండేది. అలా కంపెనీ కేరళలో కొనుగోలు చేసే మిరియాలు, యాలకుల వ్యాపారం మైసూరు ఛత్రం కింద ఉండేదన్నమాట. 1785లో టిప్పు సుల్తాన్ తన రాజ్యంలోని రేవుల నుంచి సుగంధ ద్రవ్యాల ఎగుమతిని నిలిపివేశాడు. పైగా కంపెనీతో వర్తకం చేయడానికి స్థానిక వర్తకులను అనుమతించలేదు. పైపెచ్చు, బ్రిటిష్వారికి బద్ధశత్రువులైన ఫ్రెంచివారితో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకున్నాడు. వారి సాయంతో తన సైన్యాన్ని ఆధునికీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఇవన్నీ కూడా బ్రిటిష్ వారి కోపానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటిష్ వారికి, మైసూరుకు మొత్తం నాలుగు యుద్ధాలు జరిగాయి. 1799లో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో కంపెనీ సైన్యాల చేతుల్లో టిప్పు సుల్తాన్ మరణించాడు. సుసంపన్నమైన మైసూరు ప్రాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. అయితే మైసూరును టిప్పు సుల్తాన్కు ముందు పరిపాలించిన ఒడయార్ల కుటుంబానికి అప్పగించారు. మిగిలిన ప్రాంతాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేసుకున్నారు. మైసూరు సంస్థానంతో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నారు.