హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రక్షణరంగ ఉత్పత్తుల తయారీ, ఎగుమతుల్లో రానున్న కొన్నేండ్లలో భారత్ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరనున్నదని డీఆర్డీవో చైర్మన్, రక్షణశాఖ (ఆర్అండ్ డీ) కార్యదర్శి జీ సతీశ్రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ దిశగా కీలక అడుగులు వేసినట్టు చెప్పా రు. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనల ఫలితంగా క్షిపణులు, రాడార్లు, యుద్ధ వాహనాలు, యుద్ధ విమానాలు, కమ్యూనికేషన్ వ్యవస్థల తయారీ సహా అనేక అంశాల్లో స్వయం సమృద్ధి సాధించామని పేర్కొన్నారు. రక్షణరంగ ఉత్పత్తుల దిగుమతి నుంచి క్రమంగా ఎగుమతివైపు అడుగులు వేస్తున్నామని, పరిశోధన అభివృద్ధితోపాటు పరిశ్రమలు, విద్యాసంస్థలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నామని వివరించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో ‘యాక్సిలరేటింగ్ డిఫెన్స్ ఆర్ అండ్ డీ ఫర్ ఆత్మనిర్భర భారత్’ అనే అంశంపై గురువారం నిర్వహించిన వర్చువల్ సదస్సులో సతీశ్రెడ్డి ప్రసంగించారు. విద్యార్థులను పరిశోధనలవైపు మళ్లించేలా రూ.1,000 కోట్ల బడ్జెట్తో దేశంలోని 300 విద్యాసంస్థలతో డీఆర్డీవో వివిధ ప్రాజెక్టుల్లో కలిసి పనిచేస్తున్నదని తెలిపారు. 40 విద్యాసంస్థలు డిఫెన్స్ టెక్నాలజీలో ఎంటెక్ కోర్సులు ప్రారంభించాయని చెప్పారు. ప్రైవేటు కంపెనీలను కూడా రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. డెవలప్మెంట్ ఫ్రం ప్రొడక్షన్ పార్టనర్ (డీసీపీపీ) విధానాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు.
హైదరాబాద్లోని కొన్ని ప్రైవేటు కంపెనీలకు క్షిపణులు, బాంబుల తయారీ ప్రాజెక్టులు ఇచ్చినట్టు సతీశ్రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రెండువేల వరకు కంపెనీలు రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో ఉన్నాయని చెప్పారు. భద్రతా బలగాల క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్టుగా, భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనే లా శాస్త్ర సాంకేతికతను జోడిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే క్షిపణి తయారీలో ప్రపంచంలోని ఐదు ప్రధాన దేశాలతో సమానంగా భారత్ ఉన్నదని, సుదూర లక్ష్యాలను ఛేదించే గన్స్ విభాగంలో 48 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఏకైక దేశం భారతేనని వెల్లడించారు. తాము అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను గురువారం మరోసారి విజయవంతంగా ప్రయోగించినట్టు వివరించారు. బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు కలిగిన ప్రపపంచంలోని మొదటి నాలుగైదు దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నదని పేర్కొన్నారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత శాటిలైట్లను సైతం నేరుగా కూల్చివేసే వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించిందని తెలిపారు. రాడార్ వ్యవస్థలో భారత్ ఎంతో శక్తిమంతమైనదని, ప్రస్తుతం మన భద్రతా బలగాలు 1,800 రాడార్ వ్యవస్థలు వాడుతున్నాయని చెప్పారు. 35 ఏండ్లలోపు యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేలా హైదరాబాద్ సహా ఐదు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఐదు ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆస్కి చైర్మన్ పద్మనాభయ్య మాట్లాడుతూ జీడీపీలో ఒకశాతం మాత్రమే పరిశోధనలపై ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. సదస్సులో ఆస్కి ఇంచార్జి డైరెక్టర్ జనరల్ నిర్మాల్య బగ్చీ తదితరులు పాల్గొన్నారు.