March Financial Tasks | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఈ నెలాఖరుతో ముగియనున్నది. దీంతోపాటు పలు ఫైనాన్సియల్ డెడ్లైన్లు కూడా ముగుస్తాయి. చాలా మంది గడువు దగ్గరికి వచ్చే వరకు వేచిచూద్దాం అన్న ధోరణి ప్రదర్శిస్తుంటారు. తీరా గడువు ముగిసిన తర్వాత బాధ పడుతుంటారు. మరికొందరికి గడువుపై సరైన అవగాహన ఉండదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో అడుగు పెట్టేముందు పన్ను మినహాయింపు కోసం పెట్టుబడి పథకాల్లో మదుపునకు ఈ నెలాఖరు తుది గడువు. పన్ను చెల్లింపు దారులు ఈ గడువు దాటితే భారీ పెనాల్టీ, ఇతర తీవ్ర పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 31లోపు ముగించాల్సిన ముఖ్యమైన మనీ సవాళ్లు ఇవి.
ఈ నెల 31లోపు తప్పనిసరిగా మీరు మీ ఆధార్ కార్డును పాన్కార్డుతో అనుసంధానించాలని ఆదాయం పన్ను విభాగం స్పష్టం చేసింది. ఎంతో కాలంగా ప్రతి ఒక్కరూ పాన్-ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలని చెబుతున్నది. ఒకవేళ గడువు లోపు పాన్-ఆధార్ కార్డుల అనుసంధానం మిస్ అయితే, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మీ పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుంది. అలా అయితే, బ్యాంకు సేవింగ్స్ ఖాతా గానీ, డీమ్యాట్ ఖాతా కానీ ఓపెన్ చేయడం అసాధ్యం. ఇప్పటికీ అనుసంధానం చేసుకోకపోతే మీరూ వెంటనే పాన్-ఆధార్ కార్డు అనుసంధానించండి. మీ బంధుమిత్రులకూ తెలియజేయండి.
వయో వ్రుద్ధులకు సామాజిక భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వయ వందన యోజన ( Pradhan Mantri Vaya Vandana Yojana-PMVVY) పథకం అమలు చేస్తున్నది. 60 ఏండ్ల తర్వాత ఇన్ కం కోల్పోయే వారికి అండగా ఈ స్కీం లక్ష్యం. ఈ పథకాన్ని ఎల్ఐసీ అందిస్తున్నది. ఈ నెలాఖరులోగా అర్హులైన సీనియర్ సిటిజన్లు దరఖాస్తు చేసుకోవాలి. గరిష్టంగా రూ.15 లక్షలు పే చేసి కొనుగోలు చేయొచ్చు. తదుపరి నెలలోనే పెన్షన్ అందుతూ ఉంటుంది. నెలకోసారి, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి పెన్షన్ అందుకోవచ్చు. ఈ పథకంపై ఏటా 7.4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. పదేండ్లపాటు ఈ వడ్డీరేటు కొనసాగుతుంది.
మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారా? అయితే, ఈ నెలాఖరులోగా పన్ను ఆదా ఇన్వెస్ట్మెంట్ పథకాల్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. పాత పన్ను విధానంలో ఆదాయం పన్ను చట్టంలోని 80 సీ సెక్షన్, 80డీ సెక్షన్ కింద పెట్టుబడులు పెట్టొచ్చు. 80సీ సెక్షన్ కింద జీవిత బీమా పాలసీలు, పీపీఎఫ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్), 80డీ సెక్షన్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం పేమెంట్స్ పూర్తి చేయాలి. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటున్న వారికి మాత్రం ఎటువంటి పన్ను మినహాయింపులు ఉండవు.
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్మెంట్లకు నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది. లేదా అన్ని యూనిట్లకు నామినేషన్ విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయమై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ)లకు ఈ నెలాఖరు వరకు సెబీ గడువు విధించింది. ఈ నిబంధనల అమలు చేయాలని ఇన్వెస్టర్ల ఖాతాలను స్తంభింప జేస్తామని తెలిపింది. నూతన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఈ రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాలని గతేడాది ఆగస్టులోనే సెబీ సర్క్యులర్ జారీ చేసింది. నామినేషన్ లేకుంటే డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో నాలుగో విడుత అడ్వాన్స్ టాక్స్ చెల్లింపునకు ఈ నెల 15వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది ఆదాయం పన్ను విభాగం. ఆదాయం పన్నుచట్టం-1961లోని 208 సెక్షన్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్ డిడక్షన్ తర్వాత రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ చెల్లించాలని అంచనా వేస్తే.. అడ్వాన్స్ టాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది.