ముంబై: కరోనా నియంత్రణకు రెండు డోస్ల వ్యాక్సిన్ వేయించుకున్న వారు వచ్చే ఆదివారం నుంచి ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణించొచ్చు. అయితే, రెండో డోస్ వేయించుకున్నాక 14 రోజులకు మాత్రమే అనుమతినిస్తారు. వీరి కోసం ప్రత్యేకంగా యాప్ క్రియేట్ చేశారు. ఈ యాప్ ద్వారా స్థానిక వార్డు కార్యాలయాల్లో స్పెషల్ రైల్వే పాస్ పొందాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు లేని వారు ఆఫ్లైన్లో పాస్ తీసుకోవాలి.
మహారాష్ట్రలో కరోనా రెండో వేవ్ తారా స్థాయికి చేరుకోవడంతో గత ఏప్రిల్ నుంచి సబర్బన్ లోకల్ రైళ్లలో సాధారణ ప్రయాణికులకు అనుమతి నిలిపేశారు. ప్రస్తుతం ప్రభుత్వోద్యోగులు, అత్యవసర సర్వీసుల ఉద్యోగులు మాత్రమే లోకల్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు ముంబైలో 19 లక్షల మందికి పూర్తిగా వ్యాక్సినేషన్ పూర్తయిందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.
గత కొన్ని రోజులుగా పలు సంస్థలు, రాజకీయ పార్టీలు పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్న సాధారణ ప్రజలను లోకల్ రైళ్లలో అనుమతించాలని కోరుతున్నాయి. ఇదిలా ఉంటే, కరోనా మార్గదర్శకాలను పాటించడం ద్వారా థర్డ్ వేవ్ను నియంత్రించడం ప్రజల చేతుల్లోనే ఉందని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.