చెన్నై : తమిళనాడులోని కెనికరై ప్రాంతంలో ప్రైవేట్ ఆస్పత్రి ప్రాంగణంలో పార్క్ చేసిన రెండు కార్లను దుండగులు దగ్ధం చేశారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. సెప్టెంబర్ 23 అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు డాక్టర్ మనోజ్ కుమార్కు చెందిన ఆస్పత్రిలోకి నడుచుకుంటూ వచ్చి అక్కడున్న కార్లపై పెట్రోల్ బాంబులు విసరడంతో రెండు కార్లు దగ్ధమయ్యాయి.
ఘటన అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. డాక్టర్ కారును వారు ఎందుకు దగ్ధం చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసులో జెనుల్ అసిఫ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. కోయంబత్తూర్లోని బీజేపీ కార్యాలయంపై దుండగులు పెట్రోల్ బాంబు విసిరిన రోజే ఆస్పత్రిలోని కార్లపై పెట్రోల్ బాంబులు విసరడం అనుమానాలకు తావిస్తోందని పోలీసులు పేర్కొన్నారు.