చెన్నై : సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మించి ఓ నిర్మాత తాను మైనర్గా ఉన్నప్పుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తమిళనాడులోని కోయంబత్తూర్ పొల్లాచ్చి పోలీస్ స్టేషన్లో మహిళ (20) ఫిర్యాదు చేసింది. చెన్నైకి చెందిన బాధితురాలు 2019లో సినిమాలో హీరోయిన్ ఆఫర్కు సంబంధించిన ప్రకటనను చూసి నిర్మాతను సంప్రదించింది. నిర్మాతకు ఫోన్ చేయగా తనను ఆడిషన్ కోసం లాడ్జికి రావాలని కోరాడాని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. లాడ్జికి వెళ్లిన తర్వాత తనకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి నిర్మాత పార్తీబన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది.
2019 డిసెంబర్ 22న ఈ ఘటన జరిగిందని పేర్కొంది. స్ప్రహలోకి వచ్చిన తర్వాత తనను పెండ్లి పేరుతో మభ్యపెట్టాడని పేర్కొంది. ఆపై సినిమాలో ప్రధాన పాత్ర ఇస్తానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఓసారి తాను గర్భం దాల్చితే నిందితుడు బలవంతంగా అబార్షన్ చేయించాడని తెలిపింది. ఒత్తిడి చేయడంతో 2020 నవంబర్లో పార్తీబన్ తనను వివాహం చేసుకున్నాడని, కోయంబత్తూర్లోని అపార్ట్మెంట్లో 15 నెలలు కలిసి నివసించామని పేర్కొంది.
ఆపై పార్తీబన్ మరో మహిళను వివాహం చేసుకున్నట్టు తెలియడంతో చీటింగ్ కేసుతో పాటు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశానని తెలిపింది. కాగా మహిళ ఆరోపణలను పార్తీబన్ తోసిపుచ్చాడు. మహిళ పలుమార్లు తనవద్ద డబ్బు తీసుకుని మోసగించిందని ఆరోపించాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.