అహ్మదాబాద్ : చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా రావణుడి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను జరుపుకుంటే గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈడీ, సీబీఐ, ద్రవ్యోల్బణ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. భుజ్లోని హమిర్సర్ చెరువు వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనను చేపట్టాయి.
రావణుడికి బదులు ఈడీ, సీబీఐ, ద్రవ్యోల్బణ దిష్టిబొమ్మలను ఆ పార్టీ కార్యకర్తలు దగ్ధం చేస్తూ కాషాయ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ధరల పెరుగుదల, వైద్యారోగ్య మౌలిక వసతుల లేమి, జీఎస్టీ పెరుగుదల వంటి సమస్యలపై కాషాయ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్ధలను ప్రయోగించి బీజేపీ ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.