ఖైరతాబాద్ : దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుడు మట్టి గణపతిగా దర్శనమియ్యనున్నాడు. ఈ మేరకు బుధవారం ఖైరతాబాద్ బడా గణేశ్ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు గజ్జెల నగేశ్, ఎం. మహేశ్ యాదవ్, మహేందర్బాబు మాట్లాడారు. వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేస్తామని కమిటీ ప్రకటించింది. అలాగే గణేశ్ ఉత్సవ కమిటీకి వచ్చే ఏడాది నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని ప్రస్తుత సభ్యులు నిర్ణయించారు.
ఇప్పటి వరకు కొనసాగిన కమిటీ వచ్చే ఏడాది నూతనంగా ఏర్పడుతుందని, అది కూడా కర్రపూజ (విగ్రహ నిర్మాణానికి అంకురార్పణ)కు రెండు నెలల ముందే సిద్ధమవుతుందన్నారు. ప్రస్తుతం స్థానికులకు ఇబ్బందిగా ఉన్న బారికేడ్లను నాలుగు రోజులు తొలగించాలని నిర్ణయించారు. అలాగే ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర 12గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
గత 66 సంవత్సరాలుగా బడా గణేశున్ని హుస్సేన్సాగర్లోనే నిమజ్జనం చేస్తూ వస్తున్నామని, ఈ ఏడాది కూడా అందులోనే నిమజ్జనం చేసే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఈ సమావేశంలో ప్రసాద్, జ్ఞానేశ్వర్, రాజు, రమేశ్ చారి, సుధాకర్, రాము, సత్యనారాయణ, కరాటే రమేశ్, ఎన్. శివ, మధుకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.