నిరుద్యోగులు, యువతకు బీసీ స్టడీ సర్కిల్ బాసటగా నిలుస్తున్నది. ఉద్యోగ మార్గం చూపుతున్నది. వారి భవిష్యత్కు బాటలు వేస్తున్నది. ఉద్యోగార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ.. అవసరమైన మెటీరి యల్ను సమకూరుస్తూ వారికి ఆర్థిక భారం నుంచి విముక్తి కల్పిస్తున్నది. నిపుణులైన అధ్యాపక బృందంతో నాణ్యమైన శిక్షణ అందిస్తున్నది. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో 2010లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఫ్యాకల్టీతో ఉచిత శిక్షణ అందిస్తుండడంతో యువత ఇందులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సంస్థలో 17 రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. కోర్సు ఆధారంగా 30 నుంచి 60 రోజులపాటు శిక్షణ నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో బీసీ స్టడీ సర్కిల్కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గ కేంద్రాల్లోని డిగ్రీ కళాశాలల్లో వచ్చే నెల 1వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీ స్టడీ సర్కిల్ నిరుద్యోగ యువతకు వరంగా మారింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికీ తోడ్పాటుగా నిలుస్తున్నది. పదేళ్లక్రితం జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ అండగా ఉంటున్నది. రూ.వేలల్లో ఖర్చుచేసి పోటీ పరీక్షలు చదవలేనివారికి అధ్యయన కేంద్రం కల్పతరువుగా నిలుస్తున్నది.
ఖమ్మం బీసీస్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ పొందడానికి ప్రభుత్వం ఏడాదిలో పలుమార్లు ప్రవేశపరీక్షలు నిర్వహిస్తోంది. అర్హత సాధించినవారికి మూడు నెలలపాటు ఉచిత శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇందులో చేరేందుకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. మెరిట్ ఆధారంగా శిక్షణ ఇస్తారు.
కోర్సు ఆధారంగా శిక్షణ కాలం 30 రోజుల నుంచి 60 రోజుల వరకు నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయిలో విశేష అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో బోధన చేస్తారు. వివిధ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారితో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు ఉంటుంది. క్విజ్ పోటీలు, ఓఎంఆర్ షీట్ ద్వారా వారాంతపు, మాసాంతపు పరీక్షలను నిర్వహించి సామర్థ్యాలు పరీక్షిస్తారు, శిక్షణ కాలంలో అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం, టీ, స్నాక్స్ అందిస్తున్నారు. విశ్లేషణాత్మక, పూర్తిస్థాయి స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందిస్తున్నారు. 2 వేలకు పైగా పుస్తకాలతోపాటు మ్యాగజైన్స్, ఇంగ్లిష్ న్యూస్ పేపర్స్తో లైబ్రరీని నిర్వహిస్తున్నారు. బీసీ స్టడీ సర్కిల్లో సివిల్స్తోపాటు గ్రూప్స్-1, 2 అన్ని ఉద్యోగాలకు అవసరమైన పుస్తకాలున్నాయి.
స్టడీ సర్కిల్లో శిక్షణ పొందే అభ్యర్థులకు నియమ, నిబంధనలను నిర్ణయించారు. శిక్షణ, ఇంటర్, డిగ్రీలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేసుకుని సిద్ధం చేస్తారు. సివిల్ సర్వీసెస్ మరికొన్నింటికీ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి శిక్షణకు అర్హులను నిర్ణయిస్తారు. శిక్షణ పొందే అభ్యర్థులు తప్పనిసరిగా స్టడీ సర్కిల్ వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఆధారంగా ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక అభ్యర్థి ఒక్కసారి మాత్రమే ఉచిత శిక్షణను వినియోగించుకోవాలి. బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారు.
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 10 నియోజకవర్గ కేంద్రాల్లోని డిగ్రీ కళాశాలల్లో ఏప్రిల్1వ తేదీ నుంచి శిక్షణ కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ గౌతమ్ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ అందించే విషయంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించే నోటిఫికేషన్ల అన్నింటికీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ కల్పించనున్నారు. ఆయా డిగ్రీ కళాశాలల పరిధిలోని నిరుద్యోగులకు ఉపయోగపడేలా శిక్షణ ఇవ్వనున్నారు.
2010 నుంచి స్టడీ సర్కిల్ ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఎందరినో ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దింది. ఇప్పటివరకు సివిల్స్, ప్రాథమిక పరీక్ష, గ్రూప్-2, గ్రూప్-4, బ్యాంక్ క్లర్క్, ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సీఆర్పీఎఫ్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, డీఎస్సీ, గురుకుల, ఫారెస్ట్ ఆఫీసర్స్ తదితర ఉద్యోగాలకు శిక్షణ కల్పిస్తోంది. ఈ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న వందలాది మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించారు. 524 మంది ప్రభుత్వ కొలువులు సాధించారు. గ్రూప్-2లో ఇద్దరు, ఎస్సైలుగా 12 మంది, పోలీస్ కానిస్టేబుల్స్ 81 మంది, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ 16 మంది, టీఆర్టీ గురుకుల టీచర్స్ 22 మంది, హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్స్ ముగ్గురు, గ్రూప్-4లో ఆరుగురు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 19 మంది, వీఆర్వోలు 14 మంది, బ్యాంక్ల్లో 11 మంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఎల్ఐసీలో ఒకరు ఉద్యోగం సాధించారు.
నిరుద్యోగ యువతకు వివిధ ఉద్యోగ, పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో 2010లో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్ను నెలకొల్పారు. అప్పటి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ, ప్రవేశ, ఉద్యోగ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. పూరిస్థాయిలో అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 17 రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.
పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ నిరంతరం కొనసాగుతున్నది. నిరుద్యోగ బీసీ యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వడం కోసం స్టడీ సర్కిల్ కృషి చేస్తోంది. ప్రైవేట్కు దీటుగా నైపుణ్యం కలిగిన అనుభవం ఉన్న అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తున్నాం. నోటిఫికేషన్లన్నింటికీ శిక్షణ ఇచ్చేలా సిద్ధమవుతున్నాం. 10 నియోజకవర్గ కేంద్రాల్లోని డిగ్రీ కళాశాలల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– జీ శ్రీలత, డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ ఖమ్మం
బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకోవడం నాకు కలిసొచ్చిన అంశం. నేను ఉద్యోగం సాధించేందుకు శిక్షణ ఎంతో దోహదం చేసింది. నిష్ణాతులైన అధ్యాపకులతో బోధించడం ద్వారా అభ్యర్థులకు సులువుగా అర్థమవుతుంది. ప్రతిరోజూ అభ్యర్థుల పరిజ్ఞానం, ఆయా అంశాలపై పట్టును తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించేవారు. ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ మంచి అవకాశం.
– లక్ష్మీభార్గవి, ఎస్పై
నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని హాజరయ్యా. పీజీటీ తెలుగు టీచర్గా ఉద్యోగం సాధించా. నాతోపాటు శిక్షణ తీసుకున్న చాలా మంది ఉద్యోగాలు సాధించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కసి, పట్టుదల ఉంటే బీసీ స్టడీ సర్కిల్ శిక్షణతో దాన్ని నెరవేర్చుకోవచ్చు.
– నసీమా బేగం, పీజీటీ తెలుగు బీసీ గురుకుల ఎర్రుపాలెం