అమితాబ్ బచ్చన్, గోవింద హీరోలుగా నటించిన ‘బడేమియా ఛోటేమియా’ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సినిమా. ఇప్పుడదే పేరుతో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి సినిమా చేస్తున్నారు. బడేమియాగా అక్షయ్, ఛోటేమియాగా టైగర్ తెరపైకి రాబోతున్నారు. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో వసూ బగ్నానీ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇటీవలే ఈ సినిమాను అక్షయ్ కుమార్ ప్రకటించారు. ‘నేను సినిమాల్లోకి వచ్చిన సంవత్సరం నువు భూమ్మీదకు వచ్చావు. అయినా పోటీకి సిద్ధమేనా ఛోటేమియా. సిద్ధమైతే యాక్షన్ లోకి దిగు’ అని పోస్టు చేశారు. ఇందుకు స్పందించిన టైగర్ ష్రాప్..‘సిద్ధమే బడేమియా, అతిపెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్లో ఖిలాడీలాగా నీ హీరోయిజం చూపించు’అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో ‘బడేమియా ఛోటేమియా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.