హైదరాబాద్ : బీసీల (BCs ) ను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించాల్సిందేనని బీసీ సంఘాల జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య (R Krishnaiah) హెచ్చరించారు. పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలన్నీ బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ( Constitutional rights) కల్పిస్తామని, బీసీ బిల్లు పెడతామని, బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 85 బీసీ కుల సంఘాలు, 36 బీసీ సంఘాలు, 18 బీసీ ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అన్ని కుల సంఘాల నాయకులు బీసీలకు జరుగు తున్న అన్యాయాలపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామికబద్ధమైన విద్యా, ఉద్యోగ, ఆర్థిక వాటా ఇవ్వలేదన్నారు.
రాజకీయ, పారిశ్రామిక జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. 76ఏళ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆరోపించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, కోలా జనార్ధన్, భరత్, మాజీ ఎంపీ అజీజ్ పాషా, లక్ష్మణ్ యాదవ్, కొండా దేవయ్య, గుజ్జ సత్యం తదితరులు పాల్గొన్నారు.