Iduppu Kayitham | ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో ‘ఇడుపు కాయితం’ ఒకటి. ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా టైటిల్గా ఈ పదాన్ని ప్రకటించిన తర్వాత దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు ఈ పదానికి అర్థం ఏమిటని వెతుకుతుండగా, మరికొందరు దీనిపై సోషల్ మీడియాలో చర్చలు, వాదోపవాదాలు మొదలుపెట్టారు. దీంతో ‘ఇడుపు కాయితం’ అనే పదం ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో ‘ఇడుపు కాయితం’ అనే కొత్త చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమా పూజా కార్యక్రమానికి హాజరై ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు తదితరులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రకటన తర్వాత అందరిలో ఒకే ప్రశ్న మొదలైంది. అసలు ‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటి? అంటే.. తెలంగాణ ప్రాంతీయ మాండలికంలో ‘ఇడుపు కాయితం’ అంటే విడాకుల పత్రం లేదా పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని రాసుకునే ఒప్పంద పత్రం. గతంలో కోర్టుల ద్వారా విడాకులు తీసుకునే వ్యవస్థ అంతగా అందుబాటులో లేకపోవడంతో గ్రామాల్లో పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకునేవారు. ఆ సమయంలో భార్యాభర్తలు కలిసి జీవించడం సాధ్యం కాదని భావిస్తే, పెద్దల సమక్షంలో ఒక పత్రాన్ని రాసుకుని విడిపోతుండేవారు. ఆ పత్రాన్నే ‘ఇడుపు కాయితం’ అని పిలిచేవారు.
‘ఇడుపు కాయితం’ అనేది తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో భాగంగా చాలా కాలంగా వినిపిస్తున్న పదం. కొన్ని ప్రాంతాల్లో దీనిని ‘సోడ్ చిట్టి’ లేదా ‘చోడ్ చిట్టి’ అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పెద్దల సమక్షంలో పరస్పర అంగీకారంతో విడిపోయే జంటలు ఈ పద్ధతిని అనుసరిస్తుంటారు.ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సంప్రదాయాలు కొన్ని ప్రాంతాల్లో కనిపించినప్పటికీ, ‘ఇడుపు కాయితం’ అనే పదం మాత్రం ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. సినిమా టైటిల్ ప్రకటించిన తర్వాత చాలా మంది ఈ పదాన్ని గూగుల్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. కొందరికి ఈ పదం కొత్తగా అనిపించగా, మరికొందరు స్థానిక భాషా పదాలను ప్రోత్సహించడం మంచి విషయమని అభిప్రాయపడ్డారు. అయితే కొందరు ప్రేక్షకులు అందరికీ అర్థం కాని పదాలను సినిమా టైటిళ్లుగా ఎందుకు పెడుతున్నారంటూ ప్రశ్నించగా, మరోవైపు తెలంగాణ మాండలికానికి చెందిన పదాలను గౌరవించాలని మరికొందరు వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో చర్చ కాస్త వాదోపవాదాలకు దారి తీసింది.