పాతనగరంలో పర్యాటకాన్ని పరుగు పెట్టించేలా మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మీరాలం చెరువుపై తీగల వంతెన నిర్మించబోతోంది. పురపాలక శాఖ నుంచి గ్రీన్సిగ్నల్ లభించడంతో రెండురోజుల క్రితం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యాధునిక శైలిలో నిర్మించేందుకు డిజైన్ల రూపకల్పనకు సిద్ధం చేస్తున్నది. 2.5 కిలోమీటర్ల పొడవుతో అత్తాపూర్ ఇన్నర్రింగ్ రోడ్డు నుంచి మీరాలం చెరువు మీదుగా బహుదూర్పురా వరకు నిర్మించే ఈ వంతెన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని తలదన్నే రీతిలో నిర్మించాలని నిర్ణయించారు. బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకొని వెయ్యి ఎకరాల్లో ఉన్న ఈ చెరువు.. విస్తీర్ణంలో హుస్సేన్సాగర్ తర్వాత రెండోది. దీని తర్వాతే దుర్గం చెరువు విస్తరించి ఉంటుంది. ఇప్పటికే జూపార్కుకు వచ్చే పర్యాటకులు మీరాలం చెరువు అందాలను బోటింగ్ ద్వారా ఆస్వాదిస్తున్నారు. కొత్త వంతెన పూర్తయితే నగరంలో కేబుల్ బ్రిడ్జిల సంఖ్య రెండుకు చేరుతాయి.
సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : పర్యాటకంగా పాత నగరానికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక హంగులతో భారీ కేబుల్ బ్రిడ్జిని నిర్మించే ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటీ కారిడార్లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని మించిన రీతిలో భారీ పొడవుతో ఆధునిక నిర్మాణ శైలిలో నిర్మించేందుకు డిజైన్లు రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) రెండు రోజుల కిత్రమే టెండర్ నోటిఫికేషన్ను పిలిచింది. పాత నగరంపై ప్రభుత్వాల చిన్న చూపు అనే మాటకు చోటు లేకుండా అన్ని ప్రాంతాల సమాంతర అభివృద్ధి లక్ష్యం గా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆర్వింద్కుమార్ బెంగళూరు జాతీయరహదారిపై ఉన్న మీరాలం చెరువును ప్రత్యేకంగా పరిశీలించారు. చెరువు పరిరక్షణతో పాటు పర్యాటకంగా చెరువు పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
నగరానికి దక్షిణాది ఉన్న పాత నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పురానాపూల్ నుంచి బహదూర్పుర వెళ్లే బెంగళూరు జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా ఇన్నర్ రింగు రోడ్డు ఆరాంఘర్ నుంచి చాంద్రాయణగుట్ట, సంతోష్నగర్, కర్మాన్ఘాట్ వెళ్లే మార్గంలోనూ ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఇవన్నీ పాతనగరం అభివృద్ధిలో భాగంగానే చేపడుతున్నారు. తాజాగా మీరాలం చెరువుపై సుమారు 2.50 కి.మీ పొడవుతో నిర్మించే కేబుల్ బ్రిడ్జి పాత నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఐటీ కారిడార్ ప్రాంతంలో ఐకాన్గా మారిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కంటే మెరుగైన రీతిలో మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి హెచ్ఎండీఏ నిధులను వెచ్చించనున్నది.
హైదరాబాద్ మహానగరం బెంగళూరు వెళ్లే జాతీయ రహదారిపై బహదూర్పుర – జూపార్కు దాటిన తర్వాత మీరాలం చెరువు వేయికి పైగా ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒక వైపు బెంగళూరు జాతీయరహదారి, మరోవైపు అత్తాపూర్ ఇన్నర్ రింగు రోడ్డు నుంచి చింతల్మెట్ రోడ్డు వరకు సుమారు 2.5 కి.మీ దూరం మీరాలం చెరువు పుల్ ట్యాంక్ లెవల్ విస్తరించింది. నగరం నడిబొడ్డున జలాశయాల్లో హుస్సేన్సాగర్ తర్వాత మీరాలం ట్యాంక్ చాలా ఎక్కువ విస్తీర్ణంలోనే ఉంది. ఆ తర్వాతే దుర్గం చెరువు ఉంటుంది. ప్రస్తుతం ఇన్నర్ రింగు రోడ్డు నుంచి మీరాలం చెరువు మీదుగా కేబుల్ బ్రిడ్జిని నిర్మించడంతో మూడు రకాల ప్రయోజనాలు ఉంటాయని గుర్తించి, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదట చెరువును పరిరక్షించడం, రెండోది కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తే పర్యాటకంగా ప్రయోజనం, మూడోది బహదూర్పుర నుంచి కిషన్బాగ్ మీదుగా అత్తాపూర్ వెళ్లే మార్గంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇలా పలు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పురపాలక శాఖ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ దాని బాధ్యతలను చేపట్టింది. రెండు రోజుల క్రితమే ఆకర్షణీయమైన డిజైన్ల రూపకల్పనకు టెండర్లను హెచ్ఎండీఏ ఆహ్వానించింది.