ఖైరతాబాద్/బంజారాహిల్స్, ఫిబ్రవరి 3 : రాష్ట్రంలో పెరుగుతున్న సంపదను పేదలకే తిరిగి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపంలో అందించాలన్న ఆలోచనతో పేదల కోసం ఆత్మగౌరవంతో కూడిన నివాసాలు నిర్మించి ఉచితంగా అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో రూ.9,714 కోట్లతో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరో రూ.9వేల కోట్లు కలిపి మొత్తం రూ.18వేల కోట్ల పైచీలుకు నిధులతో డబుల్ గృహాల నిర్మాణం జరుగుతుందన్నారు.
గతంలోనూ ఇళ్లు కట్టారని, అయితే అది డబ్బా ఇళ్లు కట్టించడమే కాకుండా బ్యాంకుతో లింకు, సబ్సిడీ ఇలా రక రకలా తిరకాసులు పెట్టేవారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఖైరతాబాద్లోని ఇందిరానగర్ కాలనీలో నిర్మించిన 210 డబుల్ బెడ్రూం గృహాలను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత , ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్లు పి. విజయారెడ్డి, వనం సంగీత , మన్నె కవితా రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం లాటరీ పద్ధ్దతి ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు స్వయంగా ఇంటి పట్టా అందించారు.
రూ.60లక్షల విలువైన ఇంటిని లబ్ధిదారుల చేతుల్లో పెడుతున్నప్పుడు వారు కూడా బాధ్యతగా పరిసరాలను పరిశ్రుభంగా ఉంచుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వృద్ధులు ఇబ్బంది పడకుండా లిఫ్టులు కూడా ఏర్పాటు చేశామని, పరిసరాలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, ఈ గృహ సముదాయంలో నిర్మించి 12 షాపింగ్ కాంప్లెక్స్ల ద్వారా వచ్చిన ఆదాయంతో లిఫ్టులు, ఇతర ఖర్చులకు వినియోగిస్తారన్నారు. డబుల్ బెడ్రూం గృహాలను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించిన హౌసింగ్, జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి అభినందించారు.
నియోజకవర్గానికి .. వరాల జల్లు
ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే దానం నాగేందర్ చేస్తున్న కృషి ఫలిచ్చింది. నియోజకవర్గాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.గురువారం ఖైరతాబాద్ ఇందిరానగర్ డబుల్ బెడ్రూం గృహాల ప్రారంభోత్సవం తర్వాత మంత్రితో ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధిపై గంట పాటు సమీక్ష జరిపించారు.
అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వెంటనే ఆయా శాఖల అధికారులను సమావేశానికి పిలిపించారు. ఎమ్మెల్యే దానం అభ్యర్థన మేరకు పన్నులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని తాగునీరు, సీవరేజీ పైపులైన్ల నిర్మాణం తదితర పనులకు రూ.12కోట్లు మంజూరు చేయగా, సోమాజిగూడ సెక్షన్లో 11 పనులకు రూ.2.55 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా రెడ్హిల్స్ సెక్షన్లో ఐదు పనులకు రూ.54.63లక్షలు, బంజారాహిల్స్ సెక్షన్లో 22 పనులకు రూ.3.10కోట్లు, తట్టికాన సెక్షలో 17 పనులకు రూ.1.42 కోట్లు, ఫిలింనగర్ సెక్షన్లో ఏడు పనులకు రూ.55.60లక్షలు, నారాయణగూడ సెక్షన్లో 17 పనులకు రూ.4.3 కోట్లు, జూబ్లీహిల్స్ డివిజన్లో ఏడు పనులకు రూ.1.96 కోట్లు మంజూరు చేశారు. వీటితో పాటు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఎన్డీపీ) కింద రూ.20 కోట్లు మంజూరు చేశారు. వీటితో ఎంఎస్, బీఎస్ మక్తాలో వరద నీటి కాల్వల నిర్మాణం, ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్ సీవరేజీ సమస్యకు పరిష్కారం కోసం ఈ నిధులు విడుదల చేశారు. ఈ సమావేశంలో మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.