హైదరాబాద్ భాగ్య నగరం వివేకానందుడి ప్రసంగాన్ని విని తరించిపోయించింది. జన జీవన స్రవంతిని ఆయన ప్రసంగం తట్టి లేపింది. ఆయన శిష్యులు, అభిమానులు, హైందవ ధర్మ ప్రచారకులు ఆయన ప్రసంగానికి ముగ్దులయ్యారు. నగరవాసులు ఆయన ప్రసంగ ధారాలతకు ఆశ్చర్య చకితులై జయ జయ ధ్వానాలు పలికారు. వివేకానందుడు ముందుడుగు వేసేలా నగరవాసులు భరోసా నింపారు. ప్రపంచం యావత్తు ఆయన ఉద్విగ్న ప్రసంగానికి దాసోహమై ‘జయహో’ అని ఆకాశానికి ఎత్తుకుంది.హైదరాబాద్ రైల్వేస్టేషన్లో అడుగుడిన స్వామి వివేకానందకు సుమారు 500 మంది హిందువులు, మహమ్మదీయులు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలతో సాదరంగా ఆహ్వానించారు. నగరంలో ఒక సన్యాసికి ఇంత బ్రహ్మాండమైన స్వాగతం లభించడంపై స్వామి వివేకానంద సంతోషానికి కారణమైంది. హైదరాబాద్ మతసామరస్యం ఆనాడే ఎంత పటిష్టంగా ఉందో చూసిన స్వామీజీ సంతోషభరితుడయ్యారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): చికాగో.. ఈ పేరు వినగానే అందరికీ తొలుత గుర్తొచ్చేది స్వామి వివేకానందుడే. అక్కడ జరిగిన మహాసభల్లో అతడిచ్చిన ఉపన్యాసం చప్పట్లతో మార్మోగుతూ.. ఖండాంతరాలను దాటింది. అప్పటి నుంచి అతడి పేరు విశ్వవ్యాప్తమైంది. అయితే, స్వామిజీకి చికాగో సభల్లో అంత చక్కగా మాట్లాటానికి హైదరాబాద్ పర్యటన తనకు శక్తినిచ్చిందని వివేకానందుడు వెల్లడించడం విశేషం. అంతటి గొప్ప వ్యక్తికి బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రాంతం హైదరాబాద్. ఫిబ్రవరి 13 సాయంత్రం సికింద్రాబాద్లోని మహబూబ్ కళాశాలలో ‘పాశ్చాత్యానికి వెళ్లడంలోని నా ఉద్దేశం’ అనే అంశం మీద ప్రసంగించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. అంతటి గొప్ప వ్యక్తి ప్రసంగానికి కారణమైన ఫిబ్రవరి 13న ‘స్వామి వివేకానంద డే’గా గుర్తించాలని రామకృష్ణ మఠం వాలంటీర్లు, అభిమానులు ప్రచారం చేపట్టారు. కరపత్రాలు, పుస్తకాలు పంచుతూ స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటనను వివరిస్తున్నారు.
ఇలా రాక..!
1893లో చికాగోలో జరుగుతున్న సర్వమత మహాసభలకు హిందూ మత ప్రతినిధిగా వెళ్లాలని శిష్యులు విజ్ఞప్తి చేశారు. స్వామీజీ వారి అభ్యర్థనను విన్నప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అమెరికా వెళ్లడానికి డోలాయమాన స్థితిలో ఉన్న స్వామీజీకి హైదరాబాద్ నుంచి ఆహ్వానం వచ్చింది. ఫిబ్రవరి 10న నగరానికి వచ్చిన స్వామీజీ అప్పట్లో నిజాం కరెన్సీ ముద్రణాలయంలో పని చేస్తున్న మింట్ మాస్టర్బాబు మధుసూదన్ ఛటర్జీ ఇంట్లో స్వామీజీ అతిథిగా ఉన్నారు. మక్కా మసీదు, చార్మినార్, ఫలక్నుమా, నిజాం రాజ ప్రాసాదాలు, బషీర్బాగ్, హిందూ దేవాలయాలు తదితర ముఖ్యమైన ప్రదేశాలను స్వామీజీ సందర్శించారు.
ఆకట్టుకున్న ఉపన్యాసం..!
స్వామి వివేకానంద జీవితంలో మరుపురాని రోజు. అది ఫిబ్రవరి 13. ఆ రోజు సాయంత్రం మ హబూబ్ కళాశాలలో మొదటిసారి బహిరంగ సభలో మా ట్లాడారు. వెయ్యి మందికి పైగా సభికులు పాల్గొన్నా రు. ఆంగ్ల భాషా వక్తృత్వము, పాటవమూ అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. హిందూ మత ప్రాశస్త్యమూ, సనాతన హైందవ సమాజమూ, సంస్కృతి, వేద వేదాంత భావనలూ, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలు ఇలా అనేక అంశాల గురించి సవివరంగా వివరించి శ్రోతలను విస్మయానికి గురి చేశారు. ‘మన మాతృదేశాన్ని నూతన జవసత్వాలతో పునరుజ్జీవింప చేయాలి. అందుకే ఈ పా శ్చాత్య దేశాల ప్రయాణం.’ అని చెబుతూ తన ప్రసంగా న్ని ముగించారు. ఆ మరుసటి రోజు హైందవ ఆలయ శిథిలాలను, బాబా షరావుద్దీన్ సమాధి, సర్ సాలార్జంగ్ రా జ భవనాన్ని స్వామీజీ తిలకించారు. అలా అనేక స్మృతులతో స్వామి వివేకానంద ఫిబ్రవరి 17న నగరం నుంచి చెన్నైకి బయలుదేరారు. ఈ పర్యటన అతడి చికాగో పర్యటనకు వెళ్లడానికి మార్గం సుగమం చేసింది.
మార్మోగిన మహబూబ్ కళాశాల
వివేకానంద అనగానే భారతీయులందరికీ ‘సెప్టెంబర్ 11’ చికాగో ఉపన్యాసం గుర్తుకు వస్తుంది. కానీ, పాశ్చాత్యంలో స్వామీజీ ప్రతిధ్వనికి ముందే.. ప్రాచ్యంలో, అదీ మన దేశంలో, మన రాష్ట్రంలో, తెలంగాణ నేలపైన భాగ్యనగరంలో… తొట్ట తొలి ధ్వని మొదలైంది. వివేకానందుని మొట్ట మొదటి బహిరంగ ఉపన్యాసం మహబూబ్ కాలేజీలోనే మార్మోగింది. స్వామీజీ ఉపన్యాస దినోత్సవాన్ని.. ‘వివేకానంద డే’గా అధికారికంగా జరుపుకోవటం ఎంతైనా ఆకాంక్షనీయం. – మాధురి సముద్రాల, రామకృష్ణమఠం వాలంటీర్
ఎందరో మహనీయులకు స్ఫూర్తి ప్రదాత
గాంధీ, సుభాష్ చంద్రబోస్, స్వామి వంటి ఎందరో మహనీయులకు స్ఫూర్తిగా నిలిచిన వివేకానందుడు 1893 ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ భాగ్యనగరంలో పర్యటించారు. చార్మినార్, మకా మసీద్, గోలొండ కోట తదితర ప్రాంతాలన్నింటినీ స్వామీజీ సందర్శించారు. ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో ఆయన ‘మై మిషన్ టు ద వెస్ట్’ అనే అంశంపై తొలి చారిత్రక ప్రసంగం చేశారు. ఫిబ్రవరి 13ను వివేకానంద డే గుర్తించడం సముచితం. – మధుసూదనాచార్యులు, రామకృష్ణ మఠం వాలంటీర్