హైదరాబాద్ : ఎన్నికలు, ఓట్లు ఎప్పుడూ వస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ఎందుకు ఓటు వేస్తున్నామో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల మనందరం ఇవాళ ఇక్కడ ఉన్నాం. కానీ ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సవరించే కుట్ర జరుగుతోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాసే ప్రయత్నం జరుగుతుంది. అదే జరిగితే వందేళ్లు వెనక్కి పోతామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. నగరంలోని హోటల్ టూరిజం ప్లాజాలో మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణి దేవికి మద్దతుగా పట్టభద్రుల గెట్ టు గెదర్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ..
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలలను ప్రైవేటు పరం చేస్తుంది. ప్రభుత్వరంగ సంస్థలు తొలగించేందుకు ఏకంగా ఓ మంత్రిత్వశాఖనే పెట్టారు. ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు మంత్రిత్వశాఖ అవసరం కానీ వాటిని తొలగించే శాఖ ఏర్పాటు బీజేపీ ఘనతే. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అయితే మన హక్కులు, రిజర్వేషన్లు ఉండవు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. ఇది అందరూ ఆలోచించాలి. వారసత్వ సంపదగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. కానీ వాటిని బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోంది.
అంబేద్కర్ స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారు. రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర జరుగుతున్నది. మీరంతా ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నీటిపారుదలశాఖలో జీవో నంబర్ 59 తెచ్చాం. అన్ని వర్కింగ్ ఏజెన్సీలో జనాభా ప్రాతిపదికన వర్క్ లు కేటాయించాలని తెచ్చాం. ఈ జీవో తెచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. సింగరేణిలో అమలు జరగడంలేదు అని పిర్యాదు వస్తే ఎస్సీ, ఎస్టీ కమిషన్ వెళ్లి 21 శాతం వర్క్ ఇచ్చేలా అమలు చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్రానిదన్నారు.
స్వయం ఉపాధి పథకాలు ఎన్నో తెచ్చాము. డిక్కీని బలోపీతము చేశాం. ప్రభుత్వం నుండి ఇన్పుట్ సబ్సిడీ, పవర్ సబ్సిడీ ఇచ్చాం. అంబేద్కర్ విగ్రహం 125 అడుగులు. 146 కొట్లతో హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసుకుంటున్నాం. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఆత్మగౌరవ భవనాలు, దళిత స్టడీ సర్కిల్, బుద్ధవనం త్వరలోనే ప్రారంభించుకుంటాం. ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 30 ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ ,14 ఎస్సీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. 268 గురుకులాలు ఏర్పాటు చేశాం. గతంలో 10వ తరగతి వరకు ఉండే దాన్నీ ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశాం. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో లక్షా 46 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు అంత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ లకు విదేశాల్లో చదుకునేందుకు ఓవర్సీస్ పథకం తెచ్చి రూ. 20 లక్షలు అందిస్తున్నాం. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదు.
కేంద్ర ప్రభుత్వం విధానాలపై అంతా ఆలోచించాలన్నారు. అంబేద్కర్ చెప్పినట్టు సమీకరించు, బోధించు, పోరాడు అన్న సిద్ధాంతం మేరకు పనిచేయాలన్నారు. బీజేపీ రెచ్చగొట్టే ప్రకటనలకు మోసపోవద్దన్నారు. మాయమాటలు నమ్మోద్దు. గాయి గత్తర చేసే ప్రయత్నం చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు తెచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణలో మార్కెట్ కమిటీల్లో మహిళలు చైర్మన్లు అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వాణి దేవి నిగర్వి. లక్ష మంది గ్రాడ్యుయేట్ లను తయారు చేశారు. పోటీలో ఉన్న 93 మందిలో ఒకే ఒక్క మహిళ. మహిళలందరూ వాణి దేవికి ఓటేసి చట్ట సభకు పంపించాలి. పీవీ మన ఠీవి. వాణి మన తెలంగాణ బాణి అని అందరూ వాణీదేవికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మంత్రి హరీశ్రావు కోరారు.