హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మనసు అప్పుడే తీసిన వెన్నలంటిదని, మాట మాత్రం తూటాలా పేలుతుందని మాజీ డిఫ్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ మాట్లాడితే శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయని పేర్కొన్నారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ‘సంక్షేమ తెలంగాణ సాకారం’పై ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. కష్టాలు, ఆకలి చావుల నుంచే తెలంగాణ ఉద్యమం ఆవిర్భవించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. సీఎం కేసీఆర్ తెచ్చే పథకాలకు మానవీయ కోణం ఉంటుందని పేర్కొన్నారు. 2002 ఏప్రిల్ 15న ఉమ్మడి వరంగల్ జిల్లా రామచంద్రపురం పరిధిలోని ప్రగ్యాతండాలో బానోత్ కీమానాయక్ గుడిసె కాలిపోయిన సంఘటన నుంచి కల్యాణ లక్ష్మి పథకం పుట్టిందని గుర్తుచేశారు. కీమానాయక్ కష్టాన్ని చూసి చలించిపోయిన కేసీఆర్, అప్పటికప్పుడు ఆయన బిడ్డ పెండ్లికోసం రూ.50 వేలు ఇచ్చారని తెలిపారు. కీమానాయక్ కూతురు కల్పన తమ పిల్లలిద్దరికి చంద్రశేఖర్రావు పేరు వచ్చేలా చంద్రహాసన్, చంద్రకళ అని పేర్లు పెట్టుకున్నట్టు తెలిపారు. దేశమే ఆశ్చర్యపోయేలా దళితబంధు పథకం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు కడియం ధన్యావాదాలు తెలిపారు.
కేసీఆర్తోనే మైనార్టీ సంక్షేమం
తెలంగాణలో మైనార్టీ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంక్షేమ తెలంగాణ సాకారం తీర్మానాన్ని మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్ బలపర్చారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ ఉర్దూ భాషను ఉమ్మడి రాష్ట్రంలో పాలకులెవరూ పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఉర్దూ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకొన్నారని కొనియాడారు. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఏడేండ్లలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 73 శాతం పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్లలో మహిళా సంక్షేమానికి రూ.4.5 కోట్లు ఖర్చు చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఏడేండ్లలోరూ.10 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గతంలో తెలంగాణలో అడబిడ్డ పుడితే భారంగా భావించేవారని, ఇప్పుడు ఆడపిల్లే పుట్టాలని కోరుకొనేలా కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించారు. త్వరలో గిరిజనుల పోడు సమస్యకు పరిష్కారం కలుగుతుందన్నారు.