న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) మరోసారి తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. పెరిగిన తయారీ ఖర్చుల దృష్ట్యానే ఈ భారం కొనుగోలుదారులపై వేస్తున్నట్టు సంస్థ తెలియజేసింది. కాగా, గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా ఆయా హెచ్యూఎల్ ఉత్పత్తుల ధరలు ఐదుసార్లు పెరగడం గమనార్హం. ఈ ఏడాది ఇది రెండోసారి అవగా, జనవరిలోనూ పలు ఉత్పత్తుల ధరలను సంస్థ పెంచింది. ఇక తాజాగా లక్స్, రెక్సోనా, పాండ్స్ టాల్కమ్ పౌడర్, సర్ఫ్ ఎక్సెల్, విమ్ బార్, లిక్విడ్ ధరలు 3 నుంచి 10 శాతం మేర ఎగిశాయి.
గత నెల్లోనూ వీల్ డిటర్జెంట్, రిన్ బార్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్బాయ్, పియర్స్ ధరలను హెచ్యూఎల్ 3-20 శాతం మేర పెంచింది. నిరుడు సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్లలోనూ ఇవే ఉత్పత్తుల ధరలు పెరగగా, తాజా నిర్ణయంతో వరుసగా నాలుగో నెల ధరలు పెరిగినైట్టెంది. ఇదిలావుంటే అసలే ద్రవ్యోల్బణం పరుగులు పెడుతున్న వేళ.. ఇలా ధరలు పెరుగుతూపోతే రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగకతప్పదన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. జనవరిలో రిటైల్ ధరల సూచీ 6 శాతాన్ని దాటేసిన సంగతి విదితమే.