కీవ్, మార్చి 28: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై ముప్పేటదాడి చేయడానికి నెలరోజులక్రితం బయల్దేరిన 65 కిలోమీటర్ల పొడవున్న రష్యా యుద్ధ కాన్వాయ్ను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రత్యేక రక్షణ దళం ‘ఏరోరోజ్విడ్కా’ వెల్లడించింది. డ్రోన్ల సాయంతో చిన్న బాంబులను వాహనాలపై జారవిడుస్తూ 30 సభ్యుల బృందం ఈ ఆపరేషన్లో పాలుపంచుకొన్నట్టు తెలిపింది. రాత్రి సమయాల్లో ఈ మిషన్ కొనసాగినట్టు వివరించింది. దీని కోసం టెస్లా అధిపతి ఎలాన్మస్క్కు చెందిన ‘స్టార్లింక్’ ఉపగ్రహ సాంకేతికతను వినియోగించినట్టు తెలిపింది. రష్యా దళాలపై ఉక్రెయిన్ క్రమంగా పైచేయి సాధిస్తున్నది. తమ సేనల ధాటికి తాళలేక కీవ్ నుంచి రష్యా తన దళాలను ఉపసంహరించుకొన్నదని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. కీవ్లో సోమవారం ఆన్లైన్ మాధ్యమంగా స్కూల్స్ ప్రారంభమైనట్టు మేయర్ తెలిపారు.
దక్షిణ ఉక్రెయిన్ సిటీ చోర్నోబైవ్కాలోని విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకొనే ప్రయత్నంలో రష్య దళాలు 12వసారి కూడా విఫలమయ్యాయని ఉక్రెయిన్ ప్రకటించింది. కీవ్కు సమీపంలోని ఇర్పిన్ ప్రాంతంపై ఉక్రెయిన్ బలగాలు తిరిగి పట్టు సాధించాయని స్థానిక మేయర్ ప్రకటించారు. అయితే, ఖార్కీవ్, మరియుపోల్పై రష్యా విధ్వంసకాండను కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య మంగళవారం మరోదఫా శాంతిచర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. రష్యా దాడులతో ఇప్పటివరకూ ఉక్రెయిన్కి రూ. 43 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ ఆర్థికమంత్రి తెలిపారు.
చెత్త సంచీల్లో సైనికుల మృతదేహాలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని హతమార్చేందుకు వచ్చిన 25 మందితో కూడిన రష్యన్ స్పెషల్ సర్వీసెస్ సైనిక బృందాన్ని సరిహద్దుల్లో అదుపులోకి తీసుకొన్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో వారం వ్యవధిలోనే జెలెన్స్కీపై మూడుసార్లు హత్యాయత్నం జరగ్గా, ఆయన తప్పించుకొన్నారని ఓ వార్తా సంస్థ వెల్లడించడం తెలిసిందే. మరోవైపు, యుద్ధంలో మరణించిన సొంత సైనికులను రష్యా వదిలేస్తున్నదని, మరికొన్ని చోట్ల మృతదేహాలను చెత్త సంచీల్లో కుక్కి అమానవీయంగా తరలిస్తున్నదని జెలెన్స్కీ ఆరోపించారు.