చెన్నై: హిందీ భాషపై డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషను ప్రవేశపెడితే, అప్పుడు తమిళులు శూద్రులుగా మారుతారని ఆయన అన్నారు. హిందీ భాష మాట్లాడుతున్న రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని, మాతృభాష వాడుతున్న రాష్ట్రాలు అభివృద్ధి చెందినట్లు ఆయన వెల్లడించారు. హిందీ భాషను తప్పనిసరి చేసి మళ్లీ మనుధర్మాన్ని అమలు చేస్తున్నారని ఇళంగోవన్ ఆరోపించారు. ద్రవిడార్ కజగం నిర్వహించిన సభలో ఇళంగోవన్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
హిందీ కచ్చితంగా అమలు చేయాలని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన రియాక్ట్ అవుతూ.. హిందీ భాష ఏం చేస్తుందని, అది మనల్ని శూద్రుల్నిగా మారుస్తుందని, ఆ భాష వల్ల ఎవరికీ బెనిఫిట్ ఉండదన్నారు. హిందీ మాట్లాడని బెంగాల్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అభివృద్ధి లేదని, ఆ రాష్ట్రాల్లోనే హిందీ భాషను మాట్లాడుతున్నట్లు ఆయన ఆరోపించారు.
హిందీ భాషను తప్పనిసరి చేయడం వల్ల .. ఉత్తరాది ఆచారాలను కూడా అవలంబించాల్సి వస్తుందని, అప్పుడు అది మనల్ని శూద్రులుగా మారుస్తుందని, ఆ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ ఇళంగోవన్ తెలిపారు. శూద్రులు అనే పదాన్ని తానేమీ సృష్టించలేదని, దక్షిణ భారతంలో తమిళ సమాజం సమానత్వాన్ని పాటిసత్ఉందని, కానీ ఉత్తరాది నుంచి ఓ భాష ప్రవేశించడం వల్ల అది మనల్ని వేరు చేస్తుందన్నారు. ద్రావిడ ఉద్యమ సమయంలో శూద్రులు, ఓబీసీ విద్యా హక్కుల కోసం పోరాటం చేశారని ఇళంగోవన్ గుర్తు చేశారు.