హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం తాను జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. వర్షాలు, వరదల వల్ల పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు తమకు తోచినమేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని శనివారం పిలుపునిచ్చారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని విజ్ఞప్తిచేశారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం టీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్ని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో రక్తదానం, హరితహారం, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ జీవిత విశేషాలతో తెలంగాణ భవన్లో ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేయనున్నారు. మంత్రి కేటీఆర్కు చల్లని దీవెనలు అందించాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్లోని 116 ఆలయాల్లో పూజలు నిర్వహించనున్నారు. 100 మంది దివ్యాంగులకు రెట్రోఫిట్టెడ్ బ్యాటరీ వీల్చైర్లను అందజేయనున్నట్టు తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి వెల్లడించారు.
‘సేవగల్ల హృదయం’ కేటీఆర్
కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉగ్గం రాకేశ్రాదవ్, మాట్ల తిరుపతి రూపొందించిన ప్రత్యేక గీతాన్ని శనివారం ప్రగతిభవన్లో సినీ దర్శకుడు శంకర్ ఆవిష్కరించారు. ‘యువతకు ధైర్యం నువ్వే అన్నా కేటీఆర్.. పేదోళ్ల తోడు నువ్వే అన్నా తారక రామన్నా.. అంటూ సాగే గీతాన్ని ‘సేవగల్ల హృదయం’ పేరుతో రూపొందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు, టీఆర్ఎస్ నేతలు ఎల్ రూప్సింగ్, నాయినేని రాజేశ్వర్రావు పాల్గొన్నారు. కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా బ్రిస్బేన్, అడిలైడ్ నగరాల్లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్రెడ్డి కాసర్ల, రవి సామల, కల్వకుంట్ల సాయికృష్ణ, ఆధ్వర్యంలో నిర్వహించారు.