వరంగల్, నవంబర్ 21: వరంగల్ను మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఆదివారం రాత్రి కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన వరంగల్ ఐఎంఏ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో 215 ఎకరాల్లో హెల్త్ సిటీ నిర్మిస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన మ్యాప్ ఇప్పటికే సిద్ధమైందన్నారు. కేఎంసీ, సెంట్రల్ జైలు, ఎంజీ ఎం, కంటి దవాఖానలకు సంబంధించిన 215 ఎకరాల స్థలంలో రెండువేల పడకల దవాఖానలు నిర్మిస్తామని చెప్పారు.
1,200 పడకల దవాఖానలో అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందిస్తామన్నారు. మరో 800 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని పేర్కొన్నారు. వరంగల్ను విద్యా, వైద్యపరంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే వైద్య వ్యవస్థ బలోపేతమైందన్నారు. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటుచేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారని ఉద్ఘాటించారు.
10 వేల కోట్లతో రాష్ట్రంలో వైద్యవ్యవస్థ పటిష్టతకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. తాలూకా స్థాయిలో ఐసీయూ, డయాలాసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ దవాఖానల్లో అందించే వైద్యంతో కార్పొరేట్ హాస్పిటల్స్ పోటీ పడాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగి, ప్రైవేట్ దవాఖానల్లో తగ్గాయని వెల్లడించారు.
వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు ఐఎంఏ సహరించాలని కోరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించినప్పుడే డాక్టర్లకు గుర్తింపు వస్తుందన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, ఐఎంఏ రాష్ట్ర అద్యక్షుడు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.