అహ్మదాబాద్: టీకాల అవసరం కోట్లలో ఉంది. సరఫరా ఏమో లక్షలు దాటడం లేదు. ప్రభుత్వం టీకాల పంపిణీకి పంచవర్ష ప్రణాళిక వేసుకుందా? గుజరాత్ ప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు అడిగిన ప్రశ్న ఇది. న్యాయమూర్తులు బేలా త్రివేదీ, భార్గవ్ డీ కారియాతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం టీకాల సరఫరాపై సూమోటూ కేసు విచారణకు వచ్చింది. ఆన్లైన్ రిజిస్టరు చేసుకోలేని వారికి.. ముఖ్యంగా గ్రామీణులకు బుకింగ్తో సంబంధం లేకుండా టీకాలు పంపిణీ చేయడం గురించి కోర్టు సర్కారు వివరణను కోరింది. అలాంటివారికి కనీసం 10-20 శాతం కేటాయించలేరా? చాలామంది దగ్గర సెల్ ఫోన్ల్, నెట్ ఉండకపోవచ్చు. ఉన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వారికి రాకపోవచ్చు. అలాంటివారికి బుకింగ్తో ప్రమేయం లేకుండా వచ్చినవారు వచ్చినట్టు టీకాలు ఇస్తే తప్పేముంది అని కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కనీసం గ్రామీణ ప్రాంతాల్లో అన్నా ఈ పద్ధతి అమలు చేయడంలో తప్పేముందని కోర్టు పేర్కొన్నది. 18-44 వయసువారికి 6.5 కోట్ల డోసులు కావాలని, మూడుకోట్ల డోసులకు స్వదేశీ ఉత్పత్తిదారులకు ఆర్డరు పెట్టామని అటార్నీ జనరల్ కోర్టుకు నివేదించారు. యావత్తు ఆర్డరు సరఫరా చేయగలమని ఉత్పత్తిదారులు హామీ ఇవ్వడం లేదు. రోజువారీగా 1-2 లక్షలు సరఫరా చేస్తామని అంటున్నాయి. 8.3 లక్షల కోవిషీల్డ్ డోసులు, 2.46 లక్షపల కోవాగ్జిన్ డోసుల సరఫరాకు కంపెనీలు హామీ ఇచ్చాయని ఏజీ తెలిపారు. దీనిపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సర్కారు టీకాల పంపిణీకి ‘పంచవర్ష ప్రణాళిక’ వేసుకుందా అని చురకలు వేసింది.