సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : కరోనా కేసులు మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో థర్డ్వేవ్ మొదలైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యవర్గాలు బహిరంగంగానే వెల్లడిస్తుండగా గ్రేటర్లోనూ మూడో వేవ్ మొదలైనట్లు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసుల సంఖ్య వారం రోజులు నుంచి ఒక్కసారిగా పెరుగుతుండడమే సంకేతాలంటున్నారు వైద్యనిపుణులు. ఈ నేపథ్యంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్ని ప్రభుత్వ దవాఖానల అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు.మరో పక్క వైద్య, ఆరోగ్యశాఖ కరోనా పరీక్షా కేంద్రాల సంఖ్యను మరింత పెంచేందుకు సన్నద్ధమవుతోంది. దీంతో పాటు హోమ్ ఐసోలేషన్ కిట్లు తదితర చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.
గ్రేటర్లో పెరుగుతున్న కేసుల సంఖ్య
వారం రోజులుగా పరిశీలిస్తే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డిసెంబరు 29న గ్రేటర్ వ్యాప్తంగా 121కరోనా కేసులు నమోదు కాగా ఈ నెల 1న 217కేసులు నమోదయ్యాయి. ఈ నెల 4నాటికి కేసుల సంఖ్య 659కి చేరింది. గ్రేటర్లో పెరుగుతున్న కేసుల్లో ఎక్కువగా డెల్టా వేరియంట్ కేసులు ఉంటున్నట్లు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. దీంతో పాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. గాంధీలో కరోనా ఐసీయూ కేసుల సంఖ్య ప్రస్తుతం రోజుకు పదుల సంఖ్యలో వస్తున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాటికి గాంధీలో 41మంది రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు. వీరితోపాటు 10మంది బ్లాక్ఫంగస్ కేసులు కూడా గాంధీలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం హాస్పిటల్లో 250 పడకలను అందుబాటులో ఉంచామని, కేసుల సంఖ్య ఆధారంగా పడకల సంఖ్యను పెంచుతామని తెలిపారు.
చిన్నపిల్లల పడకలు సిద్ధం
థర్డ్వేవ్లో పిల్లలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత చర్యగా చిన్నపిల్లల కోసం నిలోఫర్, గాంధీ హాస్పిటళ్లలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. గాంధీలో 300 పడకలను చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. నిలోఫర్ హాస్పిటల్లో పిల్లలకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయగా, అదనంగా మరో 800పడకలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు టిమ్స్లోనూ పిల్లలకు ప్రత్యేక పకడలను కేటాయించారు.
అప్రమత్తంగా ఉండాల్సిందే
కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కూడా విజృంభిస్తుంది. దీని వ్యాప్తి రేటు డెల్టా కంటే చాలా అధికం. కొత్త వేరియంట్పై స్పష్టమైన సమాచారం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సామూహిక కార్యక్రమాలు, దూర ప్రయాణాలు రద్దు చేసుకోవడం ఉత్తమం. ఉస్మానియాలో కరోనా అనుమానితుల కోసం 20 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశాం. సాధారణ చికిత్స కోసం వచ్చే రోగుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి నిర్ధారణ పరీక్షలు జరిపించి ఫలితాలు వచ్చే వరకు ప్రత్యేక ఐసోలేషన్లో ఉంచుతున్నాం. పాజిటివ్ వచ్చిన వారిని గాంధీకి రెఫర్ చేస్తున్నాం.
నిర్లక్ష్యం మొదటికే మోసం
వారం రోజులుగా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. గాంధీలో అడ్మిషన్స్ పెరిగాయి. రానున్న రోజుల్లో వైరస్ ఎలాంటి ప్రభావం చూపనుందో ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేం. ఫిబ్రవరి, మార్చి నాటికి కేసులు పీక్ స్టేజ్కు చేరవచ్చు. చాలా మంది కరోనా జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అది చాలా ప్రమాదకరం.
పిల్లలపై ప్రభావం పెద్దగా లేదు
గత రెండు వేవ్లను పరిశీలిస్తే కరోనా వైరస్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఒమిక్రాన్పై మన వద్ద స్పష్టమైన సమాచారం లేదు. విదేశాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అక్కడ కూడా ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై పెద్దగా లేదు. కొన్ని చోట్ల వివిధ కారణాల వల్ల అడ్మిషన్స్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అందుకు ఒమిక్రానే కారణమనే ఎవిడెన్స్ లేదు. పిల్లలకు తల్లిపాలు పట్టడం మరవద్దు. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. సామూహిక కార్యక్రమాలకు పిల్లలను తీసుకెళ్లకపోవడమే మంచిది. బయటకు వెళ్లి వచ్చిన వారు స్నానం చేసి, చేతులను శానిటైజ్ చేసుకున్నాకే పిల్లల దగ్గరికి వెళ్లడం ఉత్తమం.