హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన జీఎస్ఎల్వీ -ఎఫ్10 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. జీఎల్ఎల్వీ ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. బుధవారం ఉదయం 3.43 గంటలకు రాకెట్ కౌంట్డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. 26 గంటల పాటు నిరంతరం కౌంట్డౌన్ కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈఎస్ఓ-3 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఫొటోలను తీసి పంపించనుంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టడం, వాటికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని అందించనుంది. అయితే, రాకెట్ను గతేడాది మార్చిలోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పటికీ కరోనా మహమ్మారి, సాంకేతిక సమస్యలతో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది.